పెద్దతిప్పసముద్రం: మండలంలోని రాపూరివాండ్లపల్లికి చెందిన బత్తల సురేష్ (40) అనే సీఆర్పీఎఫ్ జవాన్ అంత్యక్రియలు సోమవారం పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. వివరాలు..మృతి చెందిన జవాన్ వైజాగ్లో సీఆర్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తూ 10 రోజుల కిందట కుటుంబ సభ్యులతో గడిపేందుకు స్వగ్రామానికి వచ్చారు. ఆదివారం ఓ వ్యవసాయ పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందడాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న ములకలచెరువు సీఐ వెంకటేశ్వర్లు, పీటీఎం ఎస్ఐ పరమేశ్ నాయక్లు సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలపై ఉన్న రక్త గాయాన్ని గుర్తించారు. ఘటనా స్థలం వద్ద పోలీసు జాగిలాలతో గాలించారు. మృతుడి తల్లి విజయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. జవాన్ మృతి విషయం తెలుసుకున్న సీఆర్పీఎఫ్ పోలీసులు సోమవారం రాపూరివాండ్లపల్లికి విచ్చేశారు. అంత్యక్రియల కోసం రూ.లక్ష రూపాయలను మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్ నల్లేశ్వర్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ పోలీసు బలగాలు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అశ్రునయనాల నడుమ అంత్యక్రియలను నిర్వహించారు.


