వృద్ధుడిపై హత్యాయత్నం
మదనపల్లె టౌన్ : బి.కొత్తకోట మండలంలో ఓ వృద్ధుడిపై హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలానికి దారి తీసింది. ఘటనపై బాఽధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోళ్లపల్లె గ్రామం రంగనాథపురానికి చెందిన వేడుక క్రిష్ణప్ప(70)కి గొర్రెలు ఉన్నాయి. వాటిని క్రిష్ణప్ప భార్య క్రిష్ణమ్మ(65) రోజూ అడవులకు వెళ్లి మేత మేపుకొని వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తమ గొర్రెలను తోలుకుని ఇంటికి వస్తుండగా అదే ఊరికి చెందిన అనసూయ, అరుణలు ఇంటి ముందుగా గొర్రెలను తోలుకుని వెళ్లరాదని ఆక్షేపించారు. విషయం తెలుసుకున్న వెంటనే క్రిష్ణప్ప వచ్చి ఎన్నో ఏళ్లుగా తాము ఈ వీధిలో గుండానే ఇంటికి తోలుకు పోతుంటే, ఏరోజూ లేని ఆక్షేపణ ఈరోజు ఎందుకు అని వారిని నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ వృద్ధ దంపతులైన క్రిష్ణప్ప, క్రిష్ణమ్మలపై డాడి చేసి తీవ్రంగా గాయపరచారు. దీంతో బాఽధితులు బి.కొంతకోట పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐ గోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలసుకున్న అనసూయ, అరుణ కుటుంబీకులు తమ పైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారా.. అంటూ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులపై అనసూయ, అరుణ, బాబురెడ్డి, తిమ్మారెడ్డిలు మూకుమ్మడిగా కర్రలతో దాడులు చేసి కొట్టడంతో క్రిష్ణప్ప తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. కుటుంబీకులు గమనించి, గ్రామస్తుల సాయంతో బాధితులను వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం క్రిష్ణప్ప పరిస్థితి విషమించడంతో రుయాకు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


