వరాల వసంతం.. రంజాన్ మాసం
ఫుణ్యాలు సంపాదించే మాసం
మహిళలు కూడా తరావీహ్ నమాజ్ చదవాలి
కమలాపురం/మదనపల్లె సిటీ : వరాల వసంతం రానే వచ్చింది. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి నగరంలో రంజాన్ సందడి వచ్చేసింది. బుధవారం రాత్రి నెల వంక కనిపించింది. గురువారం నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఈ రంజాన్ మాసం ముస్లింలకు ప్రీతి పాత్రమైంది. ఈ మాసంలో ఒక్క రుపాయి దానం చేస్తే రూ.70 చేసినంత పుణ్యం లభిస్తుందని వారి విశ్వాసం.ఏ మసీద్లో చూసినా చిన్నా, పెద్ద తేడా లేకుండా సంప్రదాయ దుస్తులు ధరించి ముస్లిం సోదరులు కనిపిస్తారు. ఈ మాసం అంతా వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు. తెల్లవారు జామున నుంచి సూర్యాస్తమయం వరకు, కనీసం ఎంగిలి కూడా మింగ కుండా ఉపవాసం ఉంటారు.
సందడిగా ఇఫ్తార్:
రంజాన్ మాసంలో ఇఫ్తార్ కార్యక్రమం సందడిగా జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలు సాయంత్రం మగ్రిబ్ నమాజ్కు మసీద్లకు చేరుకుంటారు. అక్కడ అందరూ సామూహికంగా కలసి పండ్లు, ఫలాలు తదితర వాటిని భుజించి ఉపవాస దీక్షను విడుస్తారు. ఈ కార్యక్రమంతో మసీదులు సందడిగా కనిపిస్తాయి. ముస్లింలు శుక్రవారాన్ని చాలా పవిత్ర మైన రోజుగా కొలుస్తారు. ప్రతి శుక్రవారం జుమ్మా నమాజ్ చదువుతారు. రాత్రి దర్గాలకు వెళ్లి స్వాముల వారిని కొలుస్తారు. అలాంటిది రంజాన్ మాసంలో వచ్చే శుక్రవారాలకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరూ మసీదులకు వెళ్లి ప్రత్యేక నమాజ్ ఆచరిస్తారు.
తరావీహ్ నమాజ్తో అధిక పుణ్యం
రంజాన్ మాసంలో తరావీహ్ నమాజ్కు ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష విరమించిన అనంతరం రాత్రి ఇషా నమాజ్లో భాగంగా 20 రకాతుల స్పెషల్ తరావీహ్ నమాజ్ చదువుతారు. మహ్మద్ ప్రవక్త(స.అ.వ.సొ.) ఉన్నప్పటి కాలం నుంచే ఈ తరావీహ్ నమాజ్ చదువుతున్నారు. దివ్య ఖురాన్ 30 భాగాలుగా ఉంటుంది. ఒక్కో రోజు తరావీహ్ నమాజ్లో ఒక్కో ఖురాన్ భాగం చదువుతారు. ముస్లింలు ఖురాన్ చదవాలి. చదవలేని వారు కనీసం తరావీహ్ నమాజ్లో చదివే ఖురాన్ పఠనాన్ని అయిన వినాలి. ఇలా చేయడం వలన ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఖురాన్లోని ఒక్క అక్షరం చదివితే 10 పుణ్యాలు లభిస్తాయి. మరి అలాంటిది రంజాన్ మాసంలో ఖురాన్ చదివితే అనేక రెట్లు పుణ్యాలు లభిస్తాయని మత పెద్దలు తెలిపారు. అలాగే రంజాన్లో సున్నత్ సమాజ్కు కూడా ఫరజ్ నమాజ్ చదివినంత పుణ్యం లభిస్తుందని వారు తెలిపారు.
నేటి నుంచి ఉపవాస దీక్షలు
రంజాన్ మాసం పుణ్యాలు సంపాదించే మాసం. ఖురాన్లోని ఒక అక్షరం చదివితే 10 పుణ్యాలు లభిస్తాయి. అదే రంజాన్ మాసంలో చదివితే అనేక రెట్లు ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి. ఈ మాసంలో మనం నిష్ట నియమాలు పాటించి అల్లాహ్ ఆరాధనలో గడపాలి. తమ తప్పులను క్షమించమని ప్రార్థిస్తే అల్లాహ్ తప్పక క్షమిస్తాడు. ముస్లింలు ఈ మాసం అంతా పుణ్యాలను సంపాదించుకోవాలి. – హాఫిజ్ గయాసుద్ధీన్, కమలాపురం.
ముస్లిం మహిళలు కూడా తమ ఇళ్లల్లో స్పెషల్ తరావీహ్ నమాజ్ చదవాలి. రంజాన్ మాసంలో సున్నత్ నమాజ్ ఆచరించినా, ఫర్జ్ నమాజ్ చదివినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ముస్లింలంతా ఉపవాస దీక్షలు (రోజా) పాటించి తరావీహ్ నమాజ్ చదవాలి.
– షఫీవుల్లా, పేష్ ఇమామ్, మస్జిద్–ఏ–ఖాదరియా, కమలాపురం
వరాల వసంతం.. రంజాన్ మాసం
వరాల వసంతం.. రంజాన్ మాసం
వరాల వసంతం.. రంజాన్ మాసం
వరాల వసంతం.. రంజాన్ మాసం


