గర్తుతెలియని వాహనం ఢీకొని కృష్ణజింక మృతి
ములకలచెరువు : గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో కృష్ణజింక మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాసులు కథనం మేరకు... స్థానిక మండల కేంద్రం షాదీమహల్ వద్ద రోడ్డు దాటుతున్న జింకల గుంపును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక జింక సంఘటన స్థలంలోనే మృతిచెందింది. గమనించిన స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని జింకను స్వాధీనం చేసుకొని కనుగొండ అడవిలో ఖననం చేశారు.
గొర్రెల కాపరి ఆత్మహత్యాయత్నం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కాట్నగల్లు గ్రామం కాకిమారపల్లికి చెందిన జికా శ్రీనివాసులు (40) అనే గొర్రెల కాపరి ఆత్మహత్యకు యత్నించాడు. గొర్రెలు మేపేందుకు వెళ్లిన శ్రీనివాసులు మందలోని కొన్ని గొర్రెలు కనిపించలేదని గుర్తించాడు. దీనికి తోడు అతనికి కంటి చూపు తక్కువ. దీంతో మనోవేదనకు గురై గడ్డి మందు తాగాడు. కుటుంబీకులు గుర్తించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రజా సమస్యలపై
దృష్టి సారించాలి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని అధికారులు అన్ని శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని జెడ్పీ సీఈఓ రవికుమార్ డిప్యూటి ఎంపీడీవో శ్రీనివాసులుకు సూచించారు. బుధవారం సీఈఓ స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేసి మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మండలంలోని రెండు పంచాయతీల్లో వాటర్ ప్లాంట్ మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధ చేశామని తెలిపారు.
మదనపల్లెలో చోరీ
మదనపలె టౌన్ : మదనపల్లె పటేల్ రోడ్డులోని ఓ ఇంటిలో దొంగలు తాళాలు పగలగొట్టి రూ.3 లక్షల విలువచేసే నగలు, నగదును దొంగలించుకెళ్లారు. బాఽధితులు బుధవారం ఒకటో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. స్థానిక విశ్వకిరణ్ ఆస్పత్రి సమీపంలో నివాసం ఉంటున్న మునిరామయ్య ఇంటికి తాళం వేసుకుని శివరాత్రి పండుగకు అనంతపురం వెళ్లాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న దొంగలు అర్థ రాత్రి వేళ తలుపు పగలగొట్టి, ఇంట్లో ఉన్న బీరువాలో నగలు, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గర్తుతెలియని వాహనం ఢీకొని కృష్ణజింక మృతి


