
నా భర్తను బతికించండి..
రాయచోటి టౌన్ : తమను ఎవరైనా ఆదుకొంటారని...తన భర్తకు ప్రాణబిక్ష పెడతారనే కొండం ఆశతో ఎదురు చూస్తోంది...వెంకటసుబ్బమ్మ అనే మహిళ....? నా అనే వారు ఎవరూ లేక మంచానికే పరిమితమైన భర్త కోసం..పిల్లలను ఎలాగైనా చదివించాలనే తపన... వెరసి కొండంత భారాన్ని మోస్తోంది. ఆమెను కదిలిస్తే కన్నీళ్లు పర్యంతమవుతాయి. ఆమె మాటల్లోనే...నా భర్త పేరు సుబాష్చంద్ర బోస్...మే ము రాయచోటి పట్టణంలోని కొత్తపేటలోని నాలుగు కుళాయీల సమీపంలో కాపురం ఉంటున్నాము. నా భర్త సుబాష్ చంద్రబోస్ (గతంలో వివిధ పత్రికలలో రిపోర్టర్గా పనిచేశాడు) ఫర్టిలైజర్ మేనేజర్గా పనిచేస్తూ వచ్చే డబ్బుతో జీవనం సాగించేవాళ్లం. మాకు కుమార్తె మౌనిక, కుమారుడు ధరణీధర్ ఉన్నారు. మా సంసారం సాఫీగా సాగిపోతున్న సందర్భంలో మే 16వతేది జరిగిన రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా మా కాపురాన్ని రోడ్డున పడేసింది. చిన్నమండెం మండలం కేశాపురం వద్ద నా భర్త స్కూటర్పై వస్తుండంగా ఒక కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు హెల్మెట్ ధరించడంతో గాయాలు కాలేదు కానీ.. కాళ్లు, నడుము భాగం పూర్తిగా విరిగిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి డాక్టర్లను సంప్రదిస్తే తిరుపతికి రెపర్ చేశారు. అక్కడ పలు ఆస్పత్రులలో చికిత్స చేయించినా ఎలాంటి ప్రయోజనం లేదు. అనంతరం ఏలూరు ఆస్పత్రికి వెళ్లమన్నారు. అక్కడ 11 యూనిట్ల రక్తం ఎక్కించారు. పది రోజుల తరువాత ఆపరేషన్ చేసి కుడికాలు తొడభాగంలో కండ తీసి ఎడమ కాలుకు ఆపరేషన్ చేశారు. నడుము విరిగిపోవడంతో స్టీల్ రాడ్ బిగించారు. అప్పటికే రూ.15లక్షలు మంచినీళ్లప్రాయంగా అయిపోయాయి. దొరికినకాడికిల్లా... తీసుకొచ్చి ఖర్చుపెట్టినా ఎలాంటి ప్రయోజం కనిపించడంలేదు. మంచానికే పరిమితమై ద్రవపదార్థాలు మాత్రమే ఇస్తున్నాం. కనీసం ఒక వైపు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మా ఫిర్యాదు తీసుకోలేదు. కేసు నమోదు చేసి ఉంటే మాకు ఎంతో కొంత న్యాయం జరిగుండేది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. పాప ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి ఎంసెట్ కౌన్సిలింగ్కు వెళ్లాలని ఉన్నా చదివించే స్థోమత లేక ఆపేశాం. బాబు పదో తరగతి పాసయ్యాడు. విజయవాడలో ఉన్నాడు. వాడిని మాన్పించాలనే ఆలోచనలో ఉన్నాం. మందులు కొనుక్కోవడానికి పది రూపాయలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇరుగు పొరుగువారు చేసే సాయంతో కాలం వెళ్లదీస్తున్నాం. దాతలు సహాయం చేసి తిరిగి నా భర్తను బ్రతికిస్తే చాలు...వారికి రుణపడి ఉంటాం.
దాతల సహకారం....
సుభాష్చంద్రమోబోస్ కుటుంబానికి రాయచోటి జర్నలిస్టులు రూ.13 వేల ఆర్థిక సహాయం అందించగా, రాయచోటి జిన్నా సేవా సంస్థ యజమాని రూ.10 వేలు ఆర్థిక సహాయం చేసి అంబులెన్స్ సమకూర్చారు. భవిష్యత్తుల్లో మరింత సహాయసహాకాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి ఆర్థికంగా సహకరించే వారు ఫోన్ నంబర్ 9618218655కు ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం అందిచాల్సిందిగా వారు కోరారు.
ఆదుకోవాలంటూ భార్య కంటతడి
ప్రమాదంలో గాయపడి
మంచానికి పరిమితమైన భర్త
పిల్లల చదువు మాన్పించిన తల్లిదండ్రులు