
పోతన సాహితీ పీఠం అధ్యక్షుడికి ఆహ్వానం
ఒంటిమిట్ట: అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధాన వేడుకలకు ఒంటిమిట్ట పోతన సాహితీ పీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్ని విశ్వవిద్యాలయం వారు శనివారం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరచిన వారికి గౌరవ డాక్టరేట్, జీవిత సాఫల్య పురస్కారాలను పాండిచ్చేరిలో ఈనెల 27న అందజేయనున్నారని ఒంటిమిట్ట పోతన సాహితీ పీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్ తెలిపారు.
కోదండ రామయ్యకు
స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్నపన తిరుమంజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో సుప్రభాత సమయాన శ్రీరామచంద్రమూర్తికి పట్టు వస్త్రాలు, పుష్పాలు, ఫలాలు, అభిషేక సామగ్రి సమర్పించారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణ మూర్తులకు అభిషేకాలు చేసి, పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో ముస్తాబు చేశారు. అనంతరం ఆలయ పండితులు వేద పారాయణం, సహస్త్ర నామార్చన, కుంకుమార్చన, మంగళహారతులతో విశేష పూజలు నిర్వహించారు.
జేఎన్టీయూ హాస్టల్
సాంబారులో బల్లి
కలికిరి: జేఎన్టీయూ బాలికల వసతి గృహం హాస్టల్లో శనివారం ఉదయం విద్యార్థినులు తింటున్న ఇడ్లీ, సాంబార్లో బల్లి ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థినులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చారు. బల్లి విద్యార్థిని ప్లేటులో మాత్రమే పడిందని ఆయన తెలిపారు. అర్ధగంట తరువాత విద్యార్థినులకు టిఫిన్ ఏర్పాటు చేయించారు. పరిసరాల పరిశుభ్రత పాటించక పోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని హాస్టల్ నిర్వాహకులపై ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. ఇది వరకే పలుమార్లు హాస్టల్ నిర్వహణపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థినులు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువచ్చారు.
సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి
రాయచోటి: సంక్షేమ వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదేశించారు. శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుంచి జిల్లా సాంఘిక వెనుకబడిన తరగతుల గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, నియోజకవర్గాల, మండలాల ప్రత్యేక అధికారులతో జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో ఉన్న వసతులు తదితర అంశాల తనిఖీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 156 సంక్షేమ హాస్టళ్లు, 2176 సంక్షేమ పాఠశాలలను నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. నీటి వసతి, మరుగుదొడ్లు, భోజనం తయారీ విధానం తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే తనిఖీ చేసిన హాస్టళ్లు, పాఠశాలలపై నివేదికలను సంబంధిత సంక్షేమ శాఖ అధికారులకు అందజేయాలన్నారు. కొన్ని హాస్టళ్లు, పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పని చేయకపోతే పునరుద్ధరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పోతన సాహితీ పీఠం అధ్యక్షుడికి ఆహ్వానం

పోతన సాహితీ పీఠం అధ్యక్షుడికి ఆహ్వానం

పోతన సాహితీ పీఠం అధ్యక్షుడికి ఆహ్వానం