
విద్యా సహకార అవగాహన ఒప్పందం
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాల తన విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తూ అమెరికాలోని ప్రఖ్యాత సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్తో విద్య, పరిశోధన, నైపుణ్య, అభివృద్ధి రంగాలలో అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ప్రతినిధులు జాన్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్, ఇన్నిస్ కర్టిన్, ప్రీతీ సింగాల్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాల వంటి సంస్థ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు విద్యను అందించడం ప్రశంసనీయమన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన, శిక్షణ, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలపై ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం కళాశాల డైరెక్టర్ రాజ్పుత్ మాట్లాడుతూ ఈ అవగాహనా ఒప్పందం ద్వారా విద్యార్థులలో బహుళ నైపుణ్యాల వికాసం, పరిశోధనాత్మక దృక్పథం, సాంకేతిక అంశాలపై లోతైన అవగాహన ఏర్పడేలా ఉద్దేశించామన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుధాకర్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.