
సాక్షిపై దాడి అప్రజాస్వామికం
కడప అర్బన్ : కడప సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా, దాడి చేయడం అప్రజాస్వామికమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సాక్షి బ్రాంచ్ మేనేజర్ హరినాథ్రెడ్డి, బ్యూరో ఇన్చార్జి బాలకృష్ణారెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ వెన్ను శ్రీనివాసరావు, స్టాఫ్ రిపోర్టర్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కడపలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎిస్పీ వెంకటేశ్వర్లును వారు కలిసి వినతి పత్రం అందజేశారు.
సాక్షి టీవీలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. అయినా టీడీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయం వద్ద ఆందోళనలు చేయాలని పిలుపునివ్వడం దారుణమని అన్నారు. కడపలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన టీడీపీ దుండగులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.
టీడీపీ నాయకులు చేసిన హంగామా సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, ప్రత్యక్ష సాక్షులు సైతం ఉన్నారన్నారు. ఈక్రమంలో కడపలోని డీఎస్పీ కార్యాలయంలోకి కేవలం ఇద్దరిని మాత్రమే అనుమతించారు. వినతిపత్రం ఇచ్చే సమయంలో ఫొటోను తీసుకునేందుకు కూడా డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిబ్బంది అనుమతించకపోవడం గమనార్హం. సాక్షి కార్యాలయం వద్ద దాడులకు సంబంధించి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. సాక్షి దినపత్రిక సభ్యులు, సాక్షి టీవీ ప్రతినిధులు పాల్గొన్నారు.
కొవ్వొత్తులతో నిరసన
సాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ కడపలోని కడప– పులివెందుల రహదారిలో చింతకొ మ్మదిన్నె పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న సాక్షి యూనిట్ కార్యాలయం సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అన్ని విభాగాల సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన చేపట్టారు.ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు మంచిది కాదన్నారు.

సాక్షిపై దాడి అప్రజాస్వామికం