
యువతి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. మంజునాథ కాలనీకి చెందిన దంపతులు గఫూర్, హసీనాలకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తెకు వివాహం జరిపించారు. రెండో కుమార్తె మస్తానీ(16) ఎనిమిదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్ద ఉంటోంది. గఫూర్ స్థానికంగా హోటల్లో పనిచేస్తుండగా హసీనా గొర్రెలు మేపేందుకు వెళుతుంది. సోమవారం తల్లిదండ్రులు ఇద్దరు వారి పనులకు వెళ్లగా మస్తానీ ఒకటే ఇంట్లో ఉంది. తల్లి హసీనా ఇంటికి వచ్చే సరికి మస్తానీ ఫోన్లో మాట్లాడుతుండగా తల్లి మందలించింది.
దీంతో మనస్థాపం చెందిన మస్తానీ బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. తను వేసుకున్న చున్నీతో ఆత్మహత్య చేసుకుంది. ఎంత సేపటికి బాత్రూం నుంచి మస్తానీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లి స్థానికుల సాయంతో తలుపు పగలగొట్టి చూడగా, చున్నీ నుంచి జారి కిందపడి అపస్మారక స్థితిలో మస్తానీ ఉండటాన్ని గమనించి వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు ప్రేమ వివాహమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.