
హుండీ ఆదాయం రూ.14,84,740
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ. 14,84,740 ఆదాయం వచ్చింది. మంగళవారం స్థానిక ఆలయంలో టీటీడీ వారి ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మూడు నెలల కాలానికి సంబంధించి హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ. 14,84,740 వచ్చినట్లు టీటీడీ అధికారి రత్తయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోపాలబట్టర్, కృష్ణస్వామి, రాజుస్వామి, గోకుల్స్వామి పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్లో చైర్పర్సన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్తోపాటు మొత్తం ఆరుగురు సభ్యుల నియామకానికి దరఖాస్తులను కోరుతున్నారన్నారు. చైర్పర్సన్కు గరిష్ట వయసు 65 ఏళ్లు, సభ్యులకు 60 ఏళ్లు ఉండాలన్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయో డేటా, సంబంధిత ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను 2025 జూన్ 19 సాయంత్రం 5:30 గంటలలోపు గుంటూరు అమరావతి రోడ్డులోని జంపాని టవర్స్, 4వ అంతస్తులోగల మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ కార్యాలయానికి పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 9440814416 నెంబరులో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.
పీఎం సూర్యఘర్ యోజనతో
కరెంటు బిల్లు ఆదా
రాయచోటి జగదాంబసెంటర్: ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లు ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి మేలు చేయవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ అన్నమయ్య జిల్లా పర్యవేక్షణ అధికారి ఆర్.చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్డులోని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా కార్యాలయంలో డీఈ యుగంధర్ ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ యోజన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ యోజన కింద సౌర విద్యుత్ ప్లాంట్ను పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుందన్నారు. ఒకసారి పెట్టుబడి పెట్టి సోలార్ ప్యానల్ను అమర్చుకోవడం వల్ల 40 సంవత్సరాల పాటు సున్నా కరెంటు బిల్లుతో సంతోషంగా జీవించొచ్చు అన్నారు. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ పథకానికి బ్యాంకు వారు 90 శాతం రుణం ఏడు శాతం వడ్డీతో ఇస్తారని తెలిపారు. డీఈ యుగంధర్ మాట్లాడుతూ 1 కిలో వాట్కు రూ.30 వేలు, 2 కిలోవాట్కు రూ.60 వేలు, 3 కిలోవాట్ ఆపైన రూ.78 వేల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.

హుండీ ఆదాయం రూ.14,84,740