
ఎర్ర దొంగలకు మదనపల్లె రాచబాట?
మదనపల్లె: ఎర్రచందనం అక్రమ తరలింపునకు మదనపల్లె అటవీ రేంజి సురక్షిత ప్రాంతంగా స్మగ్లర్లు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉండటం, ఇక్కడ అటవీశాఖ తనిఖీలు, దాడులు పూర్తిగా లేకపోవడంతో ఇక్కడినుంచి తరలింపునకు అటంకం లేదని నిర్ధారించాక.. ఈ ప్రాంతం మీదుగా స్మగ్లింగ్ సాగుతున్న విషయం తిరుపతి టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేశాక కాని వెలుగులోకి రాలేదు. ఈనెల 9న తంబళ్లపల్లె మండలం అన్నగారిపల్లె వద్ద 48 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ములకలచెరువు, పెద్దమండ్యం, గుర్రకొండ మండలాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఎర్ర చందనం స్మగ్లింగ్ మదనపల్లె రేంజి పరిధిలో సాగుతోందన్న విషయం స్పష్టమైంది. గతంలో పట్టుబడిన ఎర్ర చందనం, నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. అయితే కొంతకాలంగా మదనపల్లె అటవీశాఖ నుంచి దాడులు, నిఘా లేకపోవడంతో ఈ వ్యవహారం ఇంతకాలం వెలుగులోకి రాలేదు. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది.
స్మగర్లు ఎంచుకున్న మార్గాలు?
జిల్లాలోని రాజంపేట లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎర్ర చందనం దుంగలను కర్ణాటకలోని ప్రాంతాలకు తరలించేందుకు స్మగ్లర్లు మార్గాలుగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని గాలివీడు నుంచి పెద్దమండ్యం, సత్యసాయి జిల్లాలోని కదిరి మీదుగా.. మదనపల్లె రేంజిలోని ములకలచెరువు నుంచి బి.కొత్తకోట మీదుగా బెంగళూరు, చైన్నెలకు, పెద్దమండ్యం మండలంలోని పాపేపల్లె, దిగువపల్లె గ్రామాల మీదుగా, గాలివీడు మండలం గోరానిచెరువు నుంచి సరిహద్దు పాపేపల్లి పంచాయతీలోని గొర్లవానికుంట మీదుగా పెద్దమండ్యంలోకి, గుడిసివారిపల్లె మీదుగా పెద్దమండ్యం–తంబళ్లపల్లె మార్గం, గాలివీడు బస్టాండు నుండి దిగువపల్లె మీదుగా బండ్రేవు వద్ద పెద్దమండ్యం–తంబళ్లపల్లె మార్గం మీదుగా ములకలచెరువు, మదనపల్లె వైపు వెళ్తున్న మార్గం, వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల మీదుగా.. సత్యసాయి జిల్లా కదిరి నుంచి ములకలచెరువు మీదుగా బి.కొత్తకోట, శంకరాపురం నుంచి కర్ణాటకకు, అలాగే ములకలచెరువు నుంచి మద్దయ్యగారిపల్లె మీదుగా కందుకూరు, కర్ణాటకలోని చేలూరు నుంచి బెంగళూరుకు, కదిరి నుంచి ములకలచెరువు మీదుగా మదనపల్లె, అక్కడినుంచి చీకలబైలు నుంచి కర్ణాటకలోకి స్మగ్లింగ్ సాగించేందుకు ఎలాంటి ఆటకం లేకపోవడం, రద్దీ ఉండని కారణంగా ఈ మార్గాలు ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. తొమ్మిదో తేదిన తంబళ్లపల్లె నుంచి ములకలచెరువు మార్గంలోని అన్నగారిపల్లె వద్ద దుంగలు పట్టుబడ్డాయి. అంటే ఈ మార్గంలో ములకలచెరువు చేరుకుని అక్కడి నుంచి వారి గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నంగా తెలుస్తోంది. గుర్రంకొండ, పెద్దమండ్యం, మదనపల్లె మీదుగా చీకలబైలు మార్గం కూడా స్మగ్లింగ్కు సురక్షితంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రేంజిలో అధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే ఎర్ర చందనం కేసులు అధికంగా నమోదు కావడం విశేషం.
దాడుల ఊసేలేదు..
గతంలో అటవీశాఖ దాడులు చేసేది. ప్రస్తుతం దాడుల ఊసేలేదు. అన్నగారిపల్లెన వద్ద ఎర్ర చందనం దుంగలు, స్మగ్లర్లను పట్టుకునేందుకు తిరుపతి నుంచి టాస్క్ఫోర్స్ బృందం రావాల్సి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే అటవీశాఖ దాడులు లేవని స్పష్టం చేస్తున్నాయి. మదనపల్లె రేంజి పరిధిలో తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలు ఉండగా ఒక సబ్ డీఎఫ్ఓ, ఓక రేంజర్, ఒక డీఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్లు, బీటు అధికారులు, సహయ బీటు అధికారులు ఉన్నారు. వీరు నిఘా పెట్టి సమాచారం సేకరించి స్మగ్లింగ్పై దాడులు చేయవచ్చు. అయితే చాలా కాలంగా అటవీశాఖ అధికారులు కనీసం కలప అక్రమ తరలింపుపైనా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు.
సా మిల్లులపైనా తనిఖీ లేదు
మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని సామిల్లులపై అటవీశాఖ తనిఖీలు, పర్యవేక్షణ ఏమాత్రం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఒక చెట్టును నరకాలంటే రెవెన్యూ, అటవీశాఖ అనుమతులు కావాలి. అయితే సా మిల్లుల్లో నిల్వ ఉన్న వందల టన్నుల కలప ఎక్కడి నుంచి వచ్చింది, వాటికి అనుమతి ఎవరిచ్చారు, ఎవరు తరలించారు అన్న కనీసం సమాచారం సేకరించిన దాఖలాలు లేవు. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు భూముల్లోని కలప వృక్షాలను యధేచ్ఛగా నరికి తరలించుకుంటున్నారు. దీన్ని విచారించే వారు లేరు.
చెక్పోస్టుల మూత
మదనపల్లె నియోజకవర్గం చీకలబైలు, తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని శంకరాపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను మూసివేశారు. ఇవి ఉన్నప్పుడు విధుల్లోని అటవీ సిబ్బంది తనిఖీలైనా చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. దీంతో ఈ మార్గాల్లో స్మగ్లింగ్ చేసుకునేందుకు అటంకం లేకుండాపోయింది.
ఈ ప్రాంతం సేఫ్ జోన్గా స్మగర్ల కార్యకలాపాలు
ఆగిపోయిన అటవీశాఖ నిఘా, దాడులు