
వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయం
రాయచోటి: వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు ప్రపంచ ఆహార ప్రతినిధుల బృందం తెలిపింది. మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పర్యటన ఉద్దేశాన్ని తెలియపరిచారు. ప్రపంచ ఆహార కార్యక్రమ బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించింది. జిల్లాలో సాగుతున్న ప్రకృతి వ్యవసాయం తీరును పరిశీలించేందుకు మూడు రోజుల పాటు బృందం సభ్యులు జిల్లాలో పర్యటిస్తున్నట్లు బృందం ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ బాలాజీ త్రిపారి తెలిపారు. బృందంలో తనతోపాటు ప్రోగ్రామ్ అసోసియేట్ కృష్ణమూర్తి, సౌమ్య, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకట మోహన్లు ఉంటారన్నారు. వాతావరణ మార్పులు ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడం, ప్రకృతి వ్యవసాయంలో అమలవుతున్న పద్ధతులు, ప్రాంతాల్లో పరిశీలన చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా చిన్నమండెం మండలంలోని రైతు శాస్త్ర కేంద్రాన్ని సందర్శించారు. బృందం సభ్యులు వాతావరణ మార్పుల ప్రభావం, పంటల దిగుబడి, ఆహార భద్రత, వ్యవసాయం జీవన విధానాలు, మార్పుల ప్రభావం గురించి రైతుల అభిప్రాయాలను సేకరించారు.