కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య | Man Ends Life In Kadapa | Sakshi
Sakshi News home page

కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య

Jun 2 2025 1:30 PM | Updated on Jun 2 2025 1:39 PM

Man Ends Life In Kadapa

    భార్యాభర్తల మధ్య మనస్పర్థలే కారణం

    మామనే ప్రధాన నిందితుడు

    సమగ్రంగా విచారించి చర్యలు తీసుకుంటాం

    కడప చిన్నచౌక్‌ సీఐ ఓబులేసు వెల్లడి 

కడప అర్బన్‌: కడప నగరం చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అశోక్‌నగర్‌లో మసీద్‌ వీధిలో ఆదివారం సాయంత్రం సయ్యద్‌ చాంద్‌బాషా (36) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై అతని తల్లి సయ్యద్‌ జుబేదా, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామకృష్ణ నగర్‌లో నివాసం వుంటున్న సయ్యద్‌ జుబేదా చిన్నకుమారుడు సయ్యద్‌ చాంద్‌బాషాకు, అశోక్‌నగర్‌ మసీద్‌ వీధిలో నివాసం వుంటున్న షేక్‌ మహబూబ్‌ బాషా కుమార్తె ఆయేషాకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. 

వీరికి ముగ్గురు కుమారులు సంతానం. చాంద్‌బాషా ఆటోడ్రైవర్‌గాను, ఎలక్ట్రికల్‌ పనులు, ఇంకా తనకు వచ్చిన పనులను చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య ఆయేషా కడప నగరంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అతను అశోక్‌నగర్‌లోనే తన అత్తగారింటికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని వుండేవాడు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో పోలీసుస్టేషన్, కేసుల దాకా వెళ్లారు. గత ఆరునెలల నుంచి ఆయేషా తన పుట్టింటిలోనే వుంటూ పిల్లలను తనదగ్గరే పెట్టుకుంది. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణ పడుతూనే వున్నారు.

20 రోజుల క్రితం ఆయేషా తండ్రి షేక్‌ మహబూబ్‌ బాషా కువైట్‌ నుంచి వచ్చాడు. ఒకసారి తన అల్లుడు సయ్యద్‌ చాంద్‌బాషాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం చాంద్‌బాషా తల్లి జుబేదాకు దావత్‌ ఉందని చెప్పి వెళ్లాడు. తన అత్తారింటికి సమీపానికి వెళ్లాడు. ఆ సమయంలో మామ షేక్‌ మహబూబ్‌బాషా, వారి కుటుంబ సభ్యులు సయ్యద్‌ చాంద్‌ బాషాను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, కత్తి, కొడవలితో దారుణంగా నరికి హత్య చేశారు. రక్తపుమడుగులో పడివుండగా ప్రధాన నిందితుడైన షేక్‌ మహబూబ్‌బాషా, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్‌ సీఐ ఓబులేసు, ఎస్‌ఐ రవికుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.

మామ, కుటుంబ సభ్యులే మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు– హతుని తల్లి జుబేదా తన కుమారుడు సయ్యద్‌ చాంద్‌ బాషా అన్ని పనులను చేసుకుంటూ తన భార్య ఆయేషాను, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. తన కోడలికి, కుమారునికి మనస్పర్థలుండటం, తన కుమారుడిని మామ షేక్‌ మహబూబ్‌బాషా ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి  పొట్టన బెట్టుకున్నాడని ఆరోపించారు. మామతో పాటు, అతని భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులే కారణమని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

షేక్‌ మహబూబ్‌బాషానే తన అల్లుడు సయ్యద్‌ చాంద్‌బాషాను దారుణంగా హత్య చేశాడని, ఇందులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప చిన్నచౌక్‌ సీఐ ఓబులేసు తెలిపారు. కాగా పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు షేక్‌ మహబూబ్‌బాషాతో పాటు, ఇతర నిందితులు ఉన్నారని తెలిసింది. కాగా ఈ హత్యను ఆప్‌ కి ఆవాజ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, వక్ఫ్‌ పరిరక్షణ కమిటీ జేఏసీ నగర కో కన్వీనర్‌ ఒక ప్రకటనలో ఖండించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement