నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Jun 2 2025 1:06 AM | Updated on Jun 2 2025 1:06 AM

నేడు ప్రజా సమస్యల  పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 2వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్‌ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని సూచించారు.

నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాలు

కలికిరి: పట్టణంలో వెలసిన పురాతన ఆలయం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉదయం తిరుమంజనం, రాత్రి బ్రహోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 3న ధ్వజారోహణం, పల్లకీ సేవ, 4న సింహ వాహన సేవ, 5న హనుమంత వాహనం, 6న శేష వాహనం, 7న మోహిని, గజ వాహనం, 8న కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ, 9న బ్రహ్మరథోత్సవం, 10న పార్వేట, దోపోత్సవం, 11న చక్రస్నానం, ధ్వజావరోహనం, 12న శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు మురళీధరాచార్యులు కోరారు.

కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం

రాయచోటి: అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన సెక్రటరీ కరిమిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపుమేరకు ఈనెల నాలుగో తేదీన తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

కడప–గుంతకల్‌ మధ్య ప్యాసింజర్‌ రైలు

కడప కోటిరెడ్డి సర్కిల్‌: కడప– గుంతకల్‌ మధ్య ప్రత్యేక ప్యాసింజర్‌ రైలును సోమవారం నుంచి నడుపుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ రైలు నంబర్‌ 07521గా నిర్ణయించారు. ఉదయం 7:45 గంటలకు కడపలో బయలుదేరి 8:13కు ఎర్రగుంట్ల, కొండాపురానికి 8:39, తాడిపత్రికి 9:13, గుత్తి 10:3, గుంతకల్‌కు 11:45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07522) గుంతకల్లులో మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరి, గుత్తికి 1:55, తాడిపత్రికి 2: 40, కొండాపురం 3:13, ఎర్రగుంట్ల 3:43, కడపకు సాయంత్రం 5:10 గంటలకు వస్తుంది. మొత్తం 22 బోగిలతో ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

సుండుపల్లెలో

తమ్ముళ్ల తిరుగుబాటు

సుండుపల్లె: తాత్కాలిక ఇన్‌చార్జిగా కొనసాగుతున్న చమర్తి జగన్‌మోహన్‌రాజుపై సుండుపల్లెలో తమ్ముళ్లు తిరుగుబాటు ప్రకటించారు. ఆదివారం సుండుపల్లెలో పార్లమెంటు ఉపాధ్యక్షుడు భగవాన్‌ సహదేవరెడ్డి స్వగృహంలో అన్ని మండలాల టీడీపీ నాయకులు, బత్యాల వర్గీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి పోస్ట్‌ ఖాళీగా ఉందని, ఇంత వరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసికి అధికారికంగా ఇన్‌చార్జి పదవి ఇవ్వలేదని, దీంతో ఆయన రాయచోటి వెళ్లిపోయారని, ఇప్పుడు ఇన్‌చార్జి ఎవరూ లేరని పలువురు వ్యాఖ్యానించారు. ఇప్పటికీ పార్టీ రికార్డుల్లో బత్యాలే ఇన్‌చార్జిగా ఉన్నారని గుర్తు చేశారు. మహానాడు వరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రాజు సమన్వయకర్తగా ఉంటారని స్పష్టంగా చెప్పారని, కానీ ఆయన ఇన్‌చార్జి అని వేసుకుంటున్నారని విమర్శించారు. ఇది సమంజసం కాదని నాయకులు అన్నారు. సుగవాసి సుబ్రమణ్యంకు ఇన్‌చార్జి ఇవ్వలేదని, కాబట్టి ఆయన స్థానంలో బత్యాల చెంగలరాయుడుకు రాజంపేట ఇన్‌చార్జి ఇవ్వాలని, ఆయనే అన్ని విధాలా అర్హుడని అన్నారు. ఈ సమావేశంలో అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు బత్యాల వర్గీయులు, టీడీపీ సీనియర్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement