
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోపు రిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకొని సత్వరం న్యాయం చేస్తామన్నారు. గుర్రంకొండ మండలం సూరప్పగారిపల్లి నుండి ఇడగొట్టి పుష్పలత, చిన్నమండెం నుండి పఠాన్ అమీరుల్లాఖాన్లు నడవలేని పరిస్థితిలో తమ సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ వారివద్దకే వెళ్లి సమస్య విన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో వీటిని పరిష్కరించాలని గుర్రంకొండ,చిన్నండెం ఎస్ఐలను ఆదేశించారు.
నేటి నుంచి అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ పోటీలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–19 పురుషుల వన్డే క్రికెట్ మ్యాచ్లు నేటి నుంచి ఈ నెల 16వతేదీ వరకు కడపలోని వైఎస్ఆర్ఆర్ –ఏసీఏ క్రికెట్ స్టేడియం, కెఎస్ఆర్ఎం, కెఓఆర్ఎం మైదానాల్లో జరగనున్నాయి. ఈ విషయాన్ని జిల్లా క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి ప్రసాద్ సోమవారం తెలిపారు. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జట్లు పోటీల్లో తలపడతాయన్నారు.
ప్రభుత్వ పెద్దలు
మొండి వైఖరి విడనాడాలి
కడప ఎడ్యుకేషన్ : ఎస్జీలటీకు వెబ్ కౌన్సెలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే విషయంలో ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరి విడనాడాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కడప జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వెబ్ కౌన్సెలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సెలింగ్ ముద్దు అనే నినాదంతో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో దాదాపు 500 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా 25 మంది నాయకులు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తన తీరు ఇప్పటికై నా మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతారన్నారు. పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో డీఈఓ కార్యాలయాల ముట్టడి జరిగినప్పటికీ ప్రభుత్వంలో కానీ, అధికారుల్లో కానీ ఎలాంటి చలనం రాకపోవడం దారుణం అని విమర్శించారు.