
అడగండి..అడుగేయండి..!
మదనపల్లె సిటీ : తమ పిల్లల చదువు కోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు తల్లిదండ్రులు.జూన్లో బడులు పునః ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ప్రైవేటు బడులవారు ప్రవేశాల కోసం హంగు ఆర్భాటాలతో జోరుగా ప్రయత్నిస్తున్నారు. ఉపాధ్యాయులను ఇళ్లకు పంపుతూ పిల్లలను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నారు.జిల్లాలో ప్రధానంగా మదనపల్లె, రాయచోటి, రాజంపేటలతో పాటు పట్టణాలలో కార్పొరేట్ సంస్కృతి పాకింది ప్రవేశాల నేపథ్యంలో తల్లిదండ్రులు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం...
గుర్తింపు ఇలా తెలుసుకోండి....
పాఠశాల తన వివరాలను విద్యాశాఖ కార్యాలయంలో రిక్నగైజ్ కోసం నమోదు చేయాలి. ఇలా చేస్తే వారికి నిర్థిష్ట క్రమసంఖ్య, నమోదైన సంవత్సరంతో కూడిన పత్రాన్ని ఇస్తారు. దీనిని బడుల వద్ద ప్రదర్శించాలి. దీనిని పరిశీలించాకే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలి. విద్యాశాఖ వెబ్సైట్లోనూ గుర్తింపు పొందిన పాఠశాలల వివరాలను ప్రదర్శిస్తారు. డీఈవో, జిల్లా పేరు నమోదు చేసి అందులో వివరాలను తెలుసుకోవచ్చు.కొందరు 1–7 వతరగతి వరకు అనుమతి పొంది 8–10 తరగతులు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ఎంఈవో లేదా విద్యాశాఖ కార్యాలయంలో సమాచారం పొందవచ్చు.
అర్హులు ఉన్నారా...?
అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారా అని తెలుసుకోవాలి. బీఈడీ, డీఈడీ చదివిన వారు బోధిస్తున్నారా లేదా ఆరా తీయాలి. ఉపాధ్యాయులు అర్హతలు కలిగిన వివరాలను బడుల్లో బోర్డుపై పరిశీలించాలి. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ఉపాధ్యాయుల వివరాలను నోటీసు బోర్డుపై నమోదు చేయాలి.
తరగతి గదులు...మైదానం:
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదే. అనేక స్కూళ్లల్లో పిల్లలు కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేయక నేలపైనే చదువులు సాగిస్తున్నారు. డెస్క్ బల్లలు, ఫ్యాన్లు,లైట్లు, తాగునీరు, డ్రైనింగ్హాల్ తదితర వసతుల కల్పన ముఖ్యం. జిల్లాలో ప్రైవేటు బడుల్లో ఎక్కువ శాతం మైదానాలు లేవు. విద్యతో పాటు క్రీడలను అదనంగా అర్హతలుగా పరిగణించాలి. ప్రతి స్కూల్లో మైదానం ఉండాలి. ప్రత్యేక వ్యాయామ పాధ్యాయులను నియమించాలి. ఈ విషయమై యాజమాన్యాల వద్ద తల్లిదండ్రులు వివరాలు కోరాలి. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో క్రీడల్లో రాణించిన బడుల్లో విద్యాబోధన ఎలా ఉందనే విషయాన్ని ఆరా తీయాలి.
గత ఫలితాలు ..సరళి ముఖ్యం:
ఐదేళ్లలో ఉన్నత బడుల్లో ఫలితాల సరళిని పరిశీలించాలి. కొన్ని పాఠశాలల్లో ఫలితాలు ఆశించిన మేర రాకున్నా ఆర్భాటం ఎక్కువ చేసి ప్రవేశాల విషయంలో తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తారు. మెరుగైన ఫలితాలతో పాటు సాంస్కృతిక అంశాలను పరిశీలించాలి. ఏయే కార్యక్రమాల్లో అధిక శాతం విద్యార్థులు భాగస్వాములవుతున్నారో తెలుసుని నిర్ణయం తీసుకోవాలి.
గ్రంథాలయాలు:
ప్రాథమిక స్థాయి నుంచి పఠనాసక్తి కలిగించాలి. ఆ దిశగా యాజమాన్యాలు పరిస్థితులు కల్పించాలి. ఒక స్కూల్లో ఏర్పాటు చేసిన పుస్తకాల్లో కథలు, సంస్కృతి అంశాల చరిత్ర, పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారం అందుబాటులో ఉంచాలి.అయితే యాజమాన్యాలు ఎక్కడా కూడా గ్రంథలయాలు ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదు. ఈవిషయంలో తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇన్నోవేటివ్ అంశాలు:
పాఠశాలలో ఇన్నోవేటివ్ అంశాలు నేర్పిస్తున్నారా? కొత్త విషయాన్ని పిల్లలకు తెలిపేందుకు యాజమాన్యాలు పాటుపడుతున్నాయా అనే వివరాలు తెలుసుకోవాలి. గతంలో వైజ్ఞానిక ప్రదర్శనలు,ఇన్స్పైర్మనక్, సైన్స్ మేళాల్లో పాల్గొన్న విద్యార్థుల వివరాలను గమనించాలి. ప్రతిభ చాటే వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఆరా తీయాలి.
బడుల్లో జోరుగా ప్రవేశాలు
విద్యార్థుల తల్లిదండ్రులూ..జాగ్రత్త
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించాలి
పిల్లలను గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించాలి. పాఠశాల వివరాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉంటేనే చేర్పించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి.
– ప్రభాకర్రెడ్డి, ఎంఈఓ, మదనపల్లె.

అడగండి..అడుగేయండి..!