
రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోంది
రైల్వేకోడూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం ఏర్పాటై ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో ఆటవికపాలన జరుగుతూ రోజురోజుకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. సోమవారం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి అరాచక పాలన, చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమాలు అమలు చేయకుండా రెండు, మూడు నెలలకు ఒకసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు వెన్నుపోటు పొడవడమే అన్నారు. కక్ష సాధింపు పరిపాలన ఎక్కువకాలం కొనసాగించలేమని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. సైన్స్ ఆఫ్ ఇండియా సుధీర్ రెడ్డితోపాటు కృష్ణంరాజును విచారించకుండానే కేవలం సాక్షిపై కక్ష కట్టడం నీచరాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. ఏబీఎన్, టివి–5లలో జగన్ కుటుంబంపై ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడుతున్నప్పటికీ చర్యలు లేవా అని ప్రశ్నించారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఐఏఎస్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అనవసరమైన కేసులతో జైలులో పెడుతున్నారని, వ్యవస్థలను మేనేజ్చేసే చంద్రబాబు రాజ్యాంగ విలువలను పాటించడం లేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, క్షమించరని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా, పుల్లంపేటకు చెందిన సుదర్శన్ రెఢ్డిపై కొందరు దాడి చేస్తే వారిపై కేసులు పెట్టకుండా కేవలం సుదర్శన్ రెడ్డిపై కేసులు పెట్టడం నిదర్శనమన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, మందల నాగేంద్ర, సర్పంచ్ హరికృష్ణారెడ్డి, సుబ్రమణ్యం రాజు, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొమ్మినేని అరెస్టు కుట్రపూరితం
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
కొరముట్ల శ్రీనివాసులు