అన్నమయ్య జిల్లా: కూటమి ఇసుక దందాపై వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. బాహుదా నదిలో ఇష్టారీతిన ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు టీడీపీ నేతలు. వందలాది భారీ టిప్పర్లతో తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలిస్తున్నారు. ఏ మాత్రం అడ్డుకోలేక అధికార యంత్రాంగం చేతులెత్తేసింది.
రాజంపేట నియోజకవర్గం బాలరాజుపల్లి వంతెన పక్కనే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఇసుక కోసం తీసిన గోతుల్లో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. టీడీపీ నేతలు చేస్తున్న ఇసుక దందాపై అనేకసార్లు అధికారుల దృష్టికి తెచ్చినా చర్యలు శూన్యం. పెద్ద ఎత్తున ఇసుక క్వారీ వద్దకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు.
ఇసుక తవ్వకాలను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు, రమేశ్ రెడ్డి పరిశీలించారు. కూటమి నేతలు నదులను చెరబడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు.
చంద్రబాబు, టీడీపీ నేతలు దోపిడీ చేసుకునేందుకు లైసెన్స్ ఇచ్చినట్లుందని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. రోడ్డు వంతెన పక్కనే వందలాది టిప్పర్లతో ఇసుక తవ్వకాలు చేస్తున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదని కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. క్వారీని చూస్తే.. ఇసుకను ప్రొక్లెయిన్లు పెట్టి ఎంతగా దోచుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతోందని చెబుతున్నారు. భవిష్యత్తులో అక్రమ ఇసుక దందాపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు.


