రైతుకు భరోసా ఏదీ?: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

రైతుకు భరోసా ఏదీ?: వైఎస్‌ జగన్‌

Oct 31 2025 5:34 AM | Updated on Oct 31 2025 7:44 AM

YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆగ్రహం 

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా ఎత్తేశారు

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టారు.. ఈ–క్రాప్‌ నీరుగార్చారు 

రెండేళ్లలో అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకూ రూ.40 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంటే రూ.5 వేలే ఇచ్చారు

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. రాష్ట్రంలో ఈ 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయి.. ప్రభుత్వం సాయం గుండుసున్నా 

వీటికి అదనంగా ఈ తుపాను తోడైంది.. దీంతో రైతుల నడ్డి విరిగింది 

చంద్రబాబు సృష్టించిన మరో విపత్తు ఇది 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా ఉచిత పంటల బీమా 

85 లక్షల మంది రైతులకు, 70 లక్షల ఎకరాల్లో ఉచిత ఇన్సూరెన్స్‌ 

రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లింపుతో పూర్తి భరోసా 

ఆ ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్ల పరిహారం 

ఇప్పుడు కేవలం రుణాలు తీసుకున్న 19 లక్షలమంది రైతులకే 

బ్యాంకుల బీమా.. 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా వర్తిస్తే మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? 

రెండేళ్లుగా ఏ సీజన్‌లోనూ ప్రీమియం కట్టని కూటమి ప్రభుత్వం 

దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి 

అందుకే ఇది కచ్చితంగా ‘మ్యాన్‌ మేడ్‌ కెలామిటీ’ 

వీళ్లు అరకొరగా చూపించిన 5.5 లక్షల మందికే ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.600 కోట్లు ఇవ్వాలి 

8 మంది చనిపోతే తుపానుపై విజయంగా చంద్రబాబు క్రెడిట్‌ తీసుకోవడం ఏంటి?.. ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే క్రెడిట్‌ తీసుకున్నా అర్థం ఉంటుంది 

మోంథా తుపాను నేపథ్యంలో పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవాలి 

పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దు 

ప్రభుత్వం తప్పిదానికి ప్రయత్నిస్తే కచ్చితంగా అడ్డుకోవాలి 

రైతులు, ప్రజలకు తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలి 

పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ పిలుపు   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోంథా తుపాను బీభత్సం సృష్టించిందని... 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలయ్యేదని, రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేదని, విపత్తుల కారణంగా పంట నష్టపోతే రైతులకు బీమా పరిహారం దక్కేదని గుర్తుచేశారు. 

కానీ, కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిందని, ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా సదుపాయం ఉందని, మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. బాబు సృష్టించిన మరో విపత్తు ఇది అంటూ మండిపడ్డారు. మోంథా తుపాను నేపథ్యంలో గురువారం వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

తుపాను కారణంగా సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆరా తీశారు. తుపాను సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవడాన్ని ప్రశంసించారు. పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని, ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నిం­చా­లని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నేతలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే...  

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

మీ అందరికీ అభినందనలు 
మోంథా తుపాను వచ్చినప్పటి నుంచి, ప్రజలతో మమేకమవుతూ మీమీ ప్రాంతాల్లో అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. పార్టీ పిలుపు మేరకు మీరంతా చాలా చక్కగా, చురుగ్గా పనిచేస్తున్నారు. రైతులు, ప్రజలకు తోడుగా ఈ తుపానులో నిలిచారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.   

రైతులకు తోడుగా నిలవాలి 
మోంథా తుపాను బీభత్సం ఎక్కువే ఉంది. తీవ్రత తగ్గినా, రైతులపై చాలా ప్రభావం చూపింది. పంటలకు చాలా నష్టం జరిగింది. పొట్ట దశకొచ్చిన పంటలు భారీ వర్షాలకు నేలకొరిగాయి. దీంతో దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అక్కడినుంచి రాయలసీమలోని కర్నూలు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మోంథా ప్రభావం ఉంది. 25 జిల్లాలు, 396 మండలాలు, 3,320 గ్రామాల పరిధిలో ప్రభావం కనిపించింది. 

ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలవాల్సి ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై మోంథా ప్రభావం చూపింది. ఇందులో 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. 1.15 లక్షల ఎకరాల పత్తి, 1.15 లక్షల ఎకరాల వేరుశనగ, 2 లక్షల ఎకరాల మొక్కజొన్న, మరో 2 లక్షల ఎకరాల ఉద్యాన పంటల మీద మోంథా తుపాను ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పంట నష్టం అంచనాల్లో రైతులకు తోడుగా నిలవాలి. పార్టీ నాయకులంతా రైతులకు అండగా ఉంటూ పనిచేయాలి.  

జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు    

ఇది ‘మ్యాన్‌ మేడ్‌ కెలామిటీ’ 
చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతుల పరిస్థితి చూడాల్సి ఉంది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ–క్రాప్‌ వ్యవస్థ పక్కాగా ఉండేది. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) సమర్థంగా పనిచేసేవి. వాటిలో అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్స్‌ ఉండి సేవలందించేవారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు కలిసి పనిచేయడం వల్ల ప్రతి రైతుకు భరోసా దక్కేది. 

నాడు దాదాపు 85 లక్షల మంది రైతులకు దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా అమలు చేశాం. కానీ, ఈ రోజు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంటల బీమా ఉంది. ఎవరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో వారికే పంటల బీమా సదుపాయం ఉంది. బ్యాంకర్లు రుణాలిచ్చినప్పుడు, ఇన్సూ్యరెన్స్‌ కట్టించారు కాబట్టి, కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే బీమా ఉంది. 

మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? నాటి 85 లక్షల మంది రైతులు, 70 లక్షల ఎకరాలకు ఉచిత బీమా ఎక్కడ...? ఇప్పుడు కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఎక్కడ...? దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీతో పాటు, ఈ ఏడాది కూడా ఏ సీజన్‌లోనూ ఏ పంటకూ ప్రభుత్వం బీమా ప్రీమియం కట్టలేదు. కాబట్టి ఇది కచ్చితంగా మ్యాన్‌ మేడ్‌ కెలామిటీ (మానవ తప్పిదం కారణంగా సంభవించిన విపత్తు). కాబట్టి మనం పార్టీపరంగా రైతులకు అండగా నిలవాలి. 



ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ జీరో 
ఈ ప్రభుత్వంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా లేదు. గత ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 16 నెలల్లో  16 సార్లు తీవ్ర విపత్తులు, తుపాన్లు ఉత్పన్నమయ్యాయి. వీటికి అదనంగా మోంథా తుపాను తోడైంది. దీంతో రైతుల నడ్డి విరిగింది. తుపాను వల్ల 8 మంది చనిపోతే చంద్రబాబు క్రెడిట్‌ తీసుకోవడం ఏంటి? ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే క్రెడిట్‌ తీసుకున్నా అర్థం ఉంటుంది. 

వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని ప్రకృతి విపత్తుల్లో 16 మంది మాత్రమే చనిపోయారు. ఇక కూటమి పాలనలో ఎంతమంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందింది? ఎంతమంది రైతులకు ప్రభుత్వం తోడుగా నిలిచింది అని చూస్తే ఈ ప్రభుత్వం తరఫున అందిన సాయం గుండుసున్నా. చివరకు ఈ–క్రాప్‌ కూడా చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేశారు. అయినా వారి లెక్కల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపేణా దాదాపు రూ.600 కోట్లు సబ్సిడీ ఇవ్వాలి. 

అదికూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మిర్చి క్వింటాల్‌ రూ.11,781కు కొంటామన్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. కానీ, ఎక్కడా ఆ పని చేయలేదు. మామిడి కిలో రూ.12కు కొంటామన్నారు. ఒక్క రైతుకూ మేలు చేయలేదు. ఉల్లి క్వింటాల్‌కు రూ.1,200కు కొంటామన్నారు. కానీ, అక్కడా చేతులెత్తేశారు. ఆ తర్వాత హెక్టారుకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి, అది కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 

రైతుల కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు 
రాష్ట్రంలో ఈ–క్రాప్‌ లేదు. దాన్ని నీరుగార్చారు. ఆర్బీకేలను నిరీ్వర్యం చేశారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే ఇదంతా మ్యాన్‌ మేడ్‌ కెలామిటీ. అదే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 54.55 లక్షల రైతులకు తోడుగా నిలుస్తూ రూ.7,802 కోట్లతో ఉచిత పంటల బీమా పరిహారం ఇప్పించాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్‌ చేసి, నాడు ప్రభుత్వమే బీమా ప్రీమియం కట్టింది. 

రైతులపై ఎలాంటి భారం వేయలేదు. కానీ, ఈ ప్రభుత్వంలో అన్నీ మానవ తప్పిదాలే. అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తుపాను రూపంలోనూ చాలా నష్టం వస్తోంది. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి, చంద్రబాబు మోసం చేశాడు. అందుకే ఈ రోజు రైతులకు జరుగుతున్న నష్టం, వారి కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు. ఆయన తప్పిదాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.  

నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి 
ఇప్పుడు రైతులకు మనం తోడుగా నిలవాలి. పంట నష్టం అంచనాలో అండగా ఉండాలి. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి. ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా, వారి తరపున నిలవాలి. మాట్లాడాలి. ప్రజలు కానీ, రైతులు కానీ, పారీ్టకి సంబంధించినవారు కానీ.. ఎవరు కూడా ఎక్కడా మిస్‌ కాకుండా, ప్రభుత్వం కావాలని తప్పు చేయాలని చూస్తే, వాటిని గట్టిగా ప్రశ్నించాలి. రైతులకు మంచి జరిగేలా చూడాలి. నష్టం అంచనాలో ఎక్కడా, ఏ లోపం లేకుండా పూర్తి చొరవ చూపాలి.  

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను), శతృచర్ల పరీక్షిత్‌రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, దేవినేని అవినాష్‌, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేరుగు నాగార్జున, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్, పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇంచార్జి చుండూరి రవి, పార్టీ నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, కడప మాజీ మేయర్‌ సురేష్‌, చల్లా మధుసూదన్‌ రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ 
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గాల్లో నవంబరు 11న ర్యాలీలు నిర్వహించాలి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 28నే అనుకున్నా, మోంథా తుపాను కారణంగా వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ అవుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. తద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement