నాడు ప్రగల్భాలు పలికి..నేడు మౌనమా చంద్రబాబూ?
మాదక ద్రవ్యాల అడ్డాగా ఏపీ మారిపోయింది
జాతీయస్థాయిలో మంటగలిచిన రాష్ట్ర పరువు
ఏలూరు ఎంపీని కాపాడేందుకు తెలంగాణ సీఎం రేవంత్తో బాబు లాలూచీ
తన తప్పులు, స్కాంలు కప్పిపుచ్చుకునేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలు పణం
సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ నేతల మండిపాటు
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం/నెల్లూరు రూరల్/ప్రొద్దుటూరు క్రైం/కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దగుల్బాజీ పాలన సాగిస్తున్నారని, మత్తు పదార్థాలు, మగువలతో అధికార కూటమి నేతలు పట్టుబడుతున్నా.. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఆయన పాలనలో రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోయిందని, మత్తు ముఠాలు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నాయని విమర్శించారు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, టీజేఆర్ సుధాకర్బాబు, భూమన అభినయ్రెడ్డి, దూలం నాగేశ్వరరావు, మామిళ్లపల్లి జయప్రకాష్, కంభం విజయరాజు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను తప్పించేందుకు తన ఆత్మీయ సన్నిహితుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని చంద్రబాబు రంగంలోకి దింపారని విమర్శించారు.
తాము అధికారంలోకి రాగానే మత్తు పదార్థాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఈ రోజు ఏం సమాధానం చెబుతారని ప్రశి్నంచారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మత్తు పదార్థాల దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వంటి నేతలు రాసలీలలతో పట్టుబడినా వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బాబు పాలనలో టీడీపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా గంజాయి దందా నడిపిస్తున్నారని మండిపడ్డారు. మద నపల్లిలో ఒక యువకుడు గంజాయి సేవించి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడని, కుప్పంలోనూ గంజాయి దొరికిందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా పోలీసులేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఏలూరు ఎంపీ చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రం పరువు జాతీయస్థాయిలో బజారున పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కారుతో బాబు అనైతిక బంధం కొనసాగిస్తున్నారని, తన తప్పుడు పనులు, స్కాంలు కప్పిపుచ్చుకునేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతలను బాబు తాకట్టు పెట్టారని విమర్శించారు.


