మచిలీపట్నం: కూటమి ప్రభుత్వం దళారులను అడ్డుపెట్టుకుని సన్నకారు రైతులను దోచుకుంటుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇద్దరు ఎమ్మార్వోలు, ఆర్డీవో సాంబశివరావు ఆక్వరంగం రైతులను పట్టిపీడుస్తున్నారన్నారు. ఈ రోజు(సోమవారం, మార్చి 30వ తేదీ) ఆక్వారైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్కు పేర్ని నాని ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా అనంతరం మీడియాతో మాట్లాడారు పేర్ని నాని.
‘బందరు మండల పరిధిలోని చిన్న చిన్న రైతులను చెరువులు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారు. వందల ఎకరాల రైతులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎకరా రెండు ఎకరాల రైతులపై ఆంక్షలు విధిస్తూ వికృత సంస్కృతికి రెవిన్యూ సిబ్బంది పాల్పడుతున్నారు.
ఎకరం రిపేరుకు 50,000 బోరు వేసేందుకు మరో 50 వేలు వసూలు చేస్తూ ఆక్వా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెదపట్నం కానూరు గ్రామాలలో యథేచ్ఛగా మడ అడవులను చెరువులుగా తవ్వుకుంటుంటే పట్టించుకోవడం లేదు. కోన గ్రామంలో 83 సెంట్ల రైతును రికార్డులు చూపించమంటూ ఆర్డీవో నా నా హైరానా చేశారు. రైతు చెరువును పూడ్చమని ఆదేశించడం ఏంటి?, ముడుపుల మాయలో బందరు ఆర్డిఓ ఎమ్మార్వోలు రైతులపై అగత్యాలకు పాల్పడితే సహించబోం’ అని హెచ్చరించారు.


