
నెల్లూరు: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న( సోమవారం, జూలై 21) అరెస్టైన వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అర్థరాత్రి సమయంలో ఆయన్ని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.
నెల్లూరు రూరల్ డీఎస్పీ అధీనంలో ఉన్న సమయంలో శ్రీకాంత్రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. పోలీసుల అదుపులో ఉండగా శ్రీకాంత్రెడ్డిని ఆస్పత్రిలో చేర్చడంతో వైఎస్సార్సీపీలో ఆందోళన నెలకొంది.
రుస్తుం మైన్స్ అక్రమ కేసులో బిరదవోలు శ్రీకాంత్రెడ్డి నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న శ్రీకాంత్రెడ్డిని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శ్రీకాంత్రెడ్డి భార్య ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం గం. 12.30 ని.లకు ఏ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని, సాయంత్రం గం. 4.15 ని.లకు అరెస్ట్ చేశామని మెసేజ్ పెట్టారని విమర్శించారు. పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో వైఎస్సార్సీపీ నేతల్ని వేధింపులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంది.
