చికిత్స పొందుతున్న బాలును పరామర్శిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి
కత్తితో చేయి కోసుకున్న బాలాంజనేయులు
బాధితుడికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి భరోసా
కర్నూలు: పోలీసుల వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలాంజనేయులు అలియాస్ బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాత ఆర్టీఓ కార్యాలయం పక్కనున్న కమలానగర్లో నివాసం ఉంటున్న బాలు ఇంటికి మంగళవారం మధ్యాహ్నం కర్నూలు మూడో పట్టణ క్రైం పార్టీ పోలీసులు వెళ్లి సీఐ పిలుస్తున్నాడు.. రావాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో బాలాంజనేయులు ఇంట్లో ఉన్న కత్తితో చేయి కోసుకున్నాడు. భారీగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
గత ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో ఈయనపై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల ఓ చికెన్ సెంటర్ మహిళతో గొడవకు సంబంధించి పోలీసులు బాలును స్టేషన్కు రావాలంటూ బెదిరిస్తున్నారు. దీంతో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా టీడీపీ నాయకుల ఒత్తిడితోనే వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్రమంగా సారా, డ్రగ్స్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు.
ఎస్వీ మోహన్రెడ్డి పరామర్శ
విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి బాధితుడు బాలాంజనేయులును పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినప్పటికీ పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని, పోలీసుల వైఖరిని ఎండగడతామని ఎస్వీ మోహన్రెడ్డి వారికి హామీ ఇచ్చారు.


