లోకేశ్‌.. నీ ఘన చరిత్ర అందరికీ తెలుసులే! | YSRCP Fires On Nara Lokesh In Social Media | Sakshi
Sakshi News home page

లోకేశ్‌.. నీ ఘన చరిత్ర అందరికీ తెలుసులే!

May 29 2026 6:01 AM | Updated on May 29 2026 6:01 AM

YSRCP Fires On Nara Lokesh In Social Media

డీఎస్సీపై సీబీఐ విచారణకు ఆదేశించాలి 

అవినీతి, అక్రమాల్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకోవాలి 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వైఎస్సార్‌సీపీ పోస్టు

సాక్షి, అమరావతి: డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వైఎస్సార్‌సీపీ హితవు పలికింది. చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేసింది. పూర్తి మెరిట్‌ జాబితాను విడుదల చేసి డీఎస్సీ ఆశావహులకు నిజాయితీగా సమాధానం చెప్పాలే తప్ప డైవర్షన్‌ పాలిటిక్స్, వ్యక్తిగత దూషణలు చేస్తే సమాజం హర్షించదని హెచ్చరించింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’  పోస్టు చేసింది. డీఎస్సీ కుంభకోణంపై ప్రశ్నలకు లోకేశ్‌ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని నిలదీసింది. ‘వెబ్‌సైట్‌ నుంచి మెరిట్‌ జాబితాను ఎందుకు తొలగించారు?, పారదర్శకత లేకుండా స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలను ఎందుకు ఇచ్చారు?, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు?’ అంటూ చురకలు అంటించింది. 

‘మిమ్మల్ని (లోకేశ్‌ను) ఇంటర్మీడియెట్‌ పాస్‌ చేయించడానికి ఇప్పటి మంత్రి నారాయణ పడ్డ కష్టాలు అందరికీ తెలిసినవే. ఆ రోజుల్లో మీకోసం నారాయణ పడ్డ కష్టం వల్లే ఇప్పటికే మీమధ్య అనుబంధం అంత బలంగా ఉందనేది తెలిసినవారు అందరూ చెప్పుకుంటారు. అంతేకాదు.. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి మీరు తీసుకున్న డిగ్రీ వెనుక ఒక పారిశ్రామికవేత్తనుంచి తీసుకున్న ముడుపుల కథ ఉందని మర్చిపోకండి. ఆ రోజుల్లో ఆ ముడుపులను మీ ఫీజులు రూపంలో చెల్లించిన వాస్తవ కథ తెలుగు ప్రజలకు ఇంకా గుర్తు ఉంది. అలాంటి మీరు డిగ్రీల గురించి, పరీక్షల గురించి చెబితేం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది’ అని లోకేశ్‌ వ్యవహర శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడింది.  

Advertisement
 
Advertisement
Advertisement