
- ఏడాది దుర్మార్గపు పాలన, అవినీతి, వైఫల్యాలపై ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయడానికి చంద్రబాబు అధికార దుర్వినియోగం
- ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు
- తాను చేయని వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్టు చేసి కక్ష సాధింపులను పతాకస్థాయికి తీసుకెళ్లారు
- ఆ వ్యాఖ్యలను వక్రీకరించి.. సాక్షి కార్యాలయాలపై పథకం ప్రకారం దాడులు చేయించారు
- చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఈ రోజు ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది
- అది రెండింతలవుతుందని మర్చిపోకండి
- కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని మీరు అనలేదా?
- ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలని మీ బావమరిది అనలేదా?
- ఈ వ్యాఖ్యలు చూస్తే మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుంది
- సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో సోమవారం ఉదయం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్ జగన్ స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పోస్టు చేశారు.
అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదిస్తూ, వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయనను అరెస్టు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఒక పథకం ప్రకారం సాక్షి యూనిట్ కార్యాలయాలపైన దాడులు చేయించారని ధ్వజమెత్తారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని మీరు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని మీ బావమరిది గతంలో అన్న మాటలు చూస్తే.. మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తోందని వైఎస్ జగన్ దునుమాడారు. ఇంకా ఈ పోస్టులో ఆయన ఏం తెలిపారంటే..
» ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాదిగా తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టుచేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.
» సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్కు ఏం సంబంధం? కొందరు అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడంలేదా?
» ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేనివాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014–19 మధ్య ఆ ఛానల్పై (గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.

» చంద్రబాబూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగాలపై ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి.
» చంద్రబాబూ.. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఏడాది పాలనలో మహిళలు, బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునే తమ కూతురు తన్మయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించింది. కనిపెట్టడానికి మీకు, మీ యంత్రాంగానికి చేతకాలేదు.
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై 6 నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 14 మంది అత్యాచారం చేస్తే, బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారు. నేరం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేతకాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు స్కూలుకు వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురైతే, 15 మందిని రేప్ చేసి చంపేశారు. వందలకొద్దీ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేదింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్ రికార్డు ఇంత ఘోరంగా ఉంది.
» చంద్రబాబూ.. మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అధికారంకోసం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల్లా వెన్నుపోటు పొడిచి, ఏడాది పాలన తర్వాత ప్రజలముందు దోషిగా నిలబడ్డారు.
పాలనలో చతికిలపడ్డ, అసమర్థ, అవినీతి, అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి, కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతోకాలం చెల్లవు చంద్రబాబూ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.