చంద్రబాబు మాటల్ని ఆయన పుత్రుడు, దత్తపుత్రుడు వినరు
ఒక్కొక్కరికి ఒక్కో ప్రైవేటు చాపర్.. ఒక్కో ప్రైవేటు విమానం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పొదుపు చర్యల పేరుతో చంద్రబాబు చెప్పేవన్నీ సోది కబుర్లేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిస్తూ.. ‘చంద్రబాబు చెప్పే మాటలు ఆయన కొడుకు, దత్తపుత్రుడు వినరు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రైవేటు చాపర్.. ఒక్కో ప్రైవేటు విమానం ఉన్నాయి. గన్నవరం, హైదరాబాద్ ఎయిర్ పోర్టులకు వెళ్లి చూస్తే 3 విమానాలు, 3 చాపర్లు కన్పిస్తాయి. ఇంధన పొదుపు పేరిట వాళ్లు చెప్పేవన్నీ సోది కబుర్లే. ఇవేమీ వాళ్లకు వర్తించవు. ఆ సోది వినమని ప్రజల చెవిలో పువ్వులు పెడతారు’ అని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా వ్యవహారాలు) పూడి శ్రీహరి అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ బదులిస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో ఏదైతే విత్తుతామో అవే పండుతాయి. మీరు ఈ పొద్దున ఏం చేస్తున్నారో రేప్పొద్దున ఇవన్నీ వాళ్లకు చుట్టుకుంటాయి. ఈ రాష్ట్రంలో ప్రతి పోలీస్ సోదరుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి, చంద్రబాబుపై భయంతోనో ఆయన చెప్పినట్టు చేయకండి. వీటన్నిటిపై విచారణలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేశారో ఆ తప్పులపై విచారణ జరుగుతుంది. ఆ తప్పులు చేసిన అధికారులందర్ని చట్టం ముందు నిలబెడతాం.
రిటైరైనా, సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చి తీసుకొస్తాం. గవర్నెన్స్లో ఉన్నవాళ్లు కచ్చి తంగా వేసే ప్రతి అడుగు రేప్పొద్దున అదే తమకు చుట్టుకుంటే ఎలా అనేది ఆలోచన చేయాలి. అడుగులు వేయాలి. ఇప్పుడు దేవుడిచ్చి న అవకాశం ప్రజలకు మంచి చేయమని చంద్రబాబును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. ఆ స్థానాన్ని ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించాలే తప్ప కక్ష తీర్చుకునేందుకు, లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వాళ్ల జీవితాలను నాశనం చేయాలని చూడటం దుర్మార్గం. అందుకే పోలీసులకు కూడా చెబుతున్నా రేప్పొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దు’ అని స్పష్టం చేశారు.
ఎవరి నోటినుంచైనా అవే మాటలు వస్తాయి
పవన్కళ్యాణ్ హోం మంత్రి అమిత్షా వద్దకు వెళ్లారని, జగన్ని ఇబ్బంది పెట్టాలని చూశారని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘అది ఆయన(అమిత్షా) చూసిన, తెలిసిన అనుభవంతో చెబుతున్నారు. ఆయన చంద్రబాబును చూశారు. జగన్ను చూశారు. ఇప్పుడు చంద్రబాబు పాలనను చూస్తున్నారు. జగన్ చేసిన పాలన చూశారు. ఆయనే కాదు ప్రజలంతా చూశారు. అందుకే ఎవరి నోటినుంచి అయినా ఇవే మాటలు వస్తాయి’ అని స్పష్టం చేశారు.
‘తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మీ ఫొటో పెట్టుకుని ప్రచారం చేయడంతో అధికారంలోకి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కదా’ అని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘ఆయన రాష్ట్రంలో ఆయనకు ఎక్కువ పలుకుబడి ఉంటుందిగానీ జగన్కు ఎలా ఉంటుంది’ అని అన్నారు.


