
విశాఖ వాటర్ ఎమర్జెన్సీ అప్డేట్స్.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి.
తాత్కాలికంగా సమ్మె విరమణ..
- తాత్కాలికంగా సమ్మె విరమించిన జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగులు..
- మేయర్ విజ్ఞప్తి మేరకు బుధవారం వరకు సమయం ఇచ్చిన వాటర్ సప్లై సిబ్బంది..
- జీవీఎంసీ పరిధిలో మంచి నీరు అందించేందుకు మరో 7-8 గంటలు సమయం పట్టే అవకాశం..
- ఇప్పటికే అన్ని ట్యాంకుల్లో నిండుకున్న నీటి నిల్వలు..
- ట్యాంకులు నింపడానికి 4-5 గంటలు సమయం పట్టే అవకాశం..
- ఆ తరువాత పంపిణీకి మరో మూడు గంటల సమయం పట్టే ఛాన్స్..
- ఈరోజు రాత్రికి కేవలం 25 శాతం మంచి నీరు మాత్రమే పంపిణీ అయ్యే సూచనలు..
మహిళల ఆందోళన..
- విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ..
- బక్కన్నపాలెంలో ఖాళీ బిందెలతో నిరసనకు దిగిన మహిళలు..
- మంచి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామంటున్న మహిళలు..
- మేయర్తో ఇంకా ప్రారంభం కానీ వాటర్ సప్లై ఉద్యోగుల చర్చలు..
- చర్చలు సఫలమైనా నీటి విడుదలకు సమయం పట్టే అవకాశం..
👉ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. ఫలితంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు.
👉దీంతో, మూడు లక్షల ఇంటి కులాయిలు, ఆసుపత్రులు సహా పలు కీలక పరిశ్రమలకు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఉదయం ఐదు గంటల నుంచి కులాయిలు రావాల్సి ఉన్నప్పటికీ నీటి సరఫరాకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పలు కాలనీల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్పీసీఎల్, కోరమండల్, ఎస్సార్, ఆర్సీఎల్, పోర్ట్ మొదలగు పరిశ్రమలకు కూడా నీటి సరఫరా ఆగిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్థంభించిపోయింది. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీటిని ఉద్యోగులు నిలిపివేశారు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు ఖాళీ అయినట్టు సమాచారం. తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు 10 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపాలని జీవీఎంసీ యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే సాంకేతిక సమస్యలు తప్పవని వాటర్ సప్లై ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
👉ఇక, నిన్న రాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతోంది. మంచి నీళ్ళు లేక గ్రేటర్ విశాఖ జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో మేయర్తో మరోసారి చర్చలకు వెళ్ళనున్నారు వాటర్ సప్లై ఎంప్లాయిస్ యూనియన్ నేతలు. చర్చలు సఫలం అయితేనే నీటిని విడుదల చేస్తామంటున్న ఉద్యోగులు చెబుతున్నారు. జీవీఎంసీ చరిత్రలో మంచి నీటి సరఫరా ఆగిపోవడం ఇదే మొదటిసారి..
👉ఇదిలా ఉండగా.. ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మినెంట్ ఉద్యోగులతో కొంతమేర నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, అది అరకొరగానే ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

కార్మికుల డిమాండ్..
👉ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో పదేళ్లు అనుభవం ఉండి, టెక్నికల్ విధులు నిర్వహిస్తున్న సుమారు 900 మందిని సెమీ స్కిల్ కేటగిరీలో చేర్చి, ఆ మేరకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జీవీఎంసీ కౌన్సిల్ వేతనాల పెంపునకు ఆమోదం తెలపగా, అధికారులు మే నెల నుంచి నెలకు రూ.6 వేలు పెంచుతూ ఆప్కాస్ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆచరణలో పాత వేతనాలే చెల్లించడంతో పాటు, జూన్ నెల జీతాలు కూడా పాత పద్ధతిలోనే అప్లోడ్ చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన పెంపు అమలు చేయాలంటూ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చర్యలు చేపట్టండి
👉తాగునీటి విభాగం ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మేయర్, అసౌకర్యానికి సహకరించాలని కోరారు.