Rewind 2021: పడిలేచిన కెరటంలా..

Various Events on welfare and Development in Visakhapatnam 2021 - Sakshi

కోవిడ్‌ చీకట్లను చీల్చుకుంటూ సాగుతున్న పయనం 

సంక్షేమ పథకాలతో సీఎం జగన్‌ కొండంత ధైర్యం  

విశాఖ ప్రగతికి బాటలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం 

చీకటి వెలుగుల సమాహారం 2021 సంవత్సరం

కాలచక్రం గిర్రున తిరిగింది. పాత స్మృతులను చెరిపేసింది. నేటితో క్యాలెండర్‌లో ఈ ఏడాది మాయమైపోనుంది. ఇప్పటికీ కంటికి కనిపించని మహమ్మారి భయం వెంటాడుతూనే ఉంది. 2020తో పోలిస్తే 2021లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. అనేక వర్గాలు ఇప్పటికీ క్షామంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం క్షీణించింది. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. కోవిడ్‌ కట్టడికి చర్యలు చేపడుతూనే.. మరోవైపు విశాఖ ప్రగతికి బాటలు వేసింది. విశాఖను పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దేందుకు సంకల్పించి 2021లో భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనకు అనేక ప్రణాళికలు రూపొందించింది. గడిచిన ఏడాది కాలంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు సుస్థిర, ప్రశాంత విశాఖ కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితానిచ్చాయి. ఈ ఏడాది జిల్లాలో జరిగిన సంక్షేమం.. అభివృద్ధి.. వివిధ సంఘటనలు ఓసారి పరికిస్తే..     – దొండపర్తి(విశాఖ దక్షిణ)  

జగనన్న అమ్మ ఒడి చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి, ఎంపీ ఎంవీవీ

జనవరి 
11వ తేదీన అమ్మ ఒడి పథకం ద్వారా జిల్లాలో 4.1 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున నగదును జమ చేసిన ప్రభుత్వం. 
16వ తేదీన జిల్లాలో ప్రారంభమైన కోవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమం  
20వ తేదీన విశాఖ–భోగాపురం ఆరులైన్ల రహదారి నిర్మాణంలో భాగంగా గోస్తనీ సంగమం వద్ద వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  
21వ తేదీన ఇంటి ముంగిటకే రేషన్‌ సరకులు అందించేందుకు జిల్లాలో 828 మినీ ట్రక్కులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు  
22వ తేదీన స్వచ్ఛ సర్వేక్షణ్‌–2021లో భాగంగా సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ అంశంలో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకిన విశాఖ  
28వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు కింద పర్యావరణహితంగా, ప్రజా ప్రయోజనకరంగా బీచ్‌ను తీర్చిదిద్దేందుకు తొలి విడతలో రూ.45.09 కోట్ల నిధులు మంజూరుకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 


స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కార్యాలయం నుంచి కూర్మన్నపాలెం వరకు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి 

ఫిబ్రవరి 
4వ తేదీన మధురవాడలో అదానికి 130 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  
12వ తేదీన హైదరాబాద్‌ నుంచి విహార యాత్రకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతున్న తరుణంలో అనంతగిరి ఘాట్‌ రోడ్డు లోయలో ప్రమాదవశాత్తూ టూరిస్టు బస్సు పడిన ఘటనలో నలుగురు మృతి.  
17వ తేదీన శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. విమానాశ్రయంలో స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘ నాయకులతో సుదీర్ఘ భేటీ. 
20వ తేదీన స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కార్యాలయం నుంచి కూర్మన్నపాలెం వరకు 25 కిలోమీటర్ల మేర వెల్లువలా తరలివచ్చిన ప్రజానీకంతో కలిసి ఉక్కు పరిశ్రమ పోరాట యాత్ర చేసిన ఎంపీ వి.విజయసాయిరెడ్డి 

 

కర్నూలు– విశాఖ విమాన సర్వీస్‌ ప్రారంభం

మార్చి  
14వ తేదీన జీవీఎంసీ ఎన్నికల్లో 58 స్థానాల్లో గెలుపొంది మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 
18వ తేదీన నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గొలగాని హరివెంకటకుమారి  
20వ తేదీన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.సృజన  
28వ తేదీన కర్నూలు–విశాఖ విమాన సర్వీసులు ప్రారంభం. 
29వ తేదీన దళిత గిరిజనులకు తిరమలేశుని దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి  

వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ ఎంవీవీ, ఎమ్మెల్యేలు 

ఏప్రిల్‌  
3వ తేదీన ప్రత్యేక అధికారుల పాలనకు ముగింపు పలుకుతూ గ్రామాల వారీగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నిరాడంబరంగా పదవీ బాధ్యతల స్వీకరణ  
8వ తేదీన ప్రశాంతంగా ముగిసిన పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌  
9వ తేదీన తొమ్మిదేళ్ల తర్వాత ఏర్పాటైన జీవీఎంసీ పాలకవర్గం. తొలి సమావేశంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కౌన్సిల్‌. 
15వ తేదీన మిథిలాపురి వుడా కాలనీలో ఆదిత్య ఫార్చ్యూన్‌ అపార్టుమెంట్‌లో అగ్ని ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ కుటుంబంలో భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమారులు అనుమానాస్పద మృతి. 
15వ తేదీన పెందుర్తి మండలం వి.జుత్తాడలో పాత కక్షలతో ఒకే కుటుంబంలోని ఆరుగురిని అత్యంత పాశవికంగా నరికి చంపిన మానవమృగం అప్పలరాజు 
19వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా జిల్లాలో 93,189 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.56.46 కోట్లు తొలి త్రైమాసిక ఫీజు కింద జమ చేసిన ప్రభుత్వం  
20వ తేదీన వీఎంఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీతో పాటు అథారిటీని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 
20వ తేదీన వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద జిల్లాలో 31,187 మంది రైతుల ఖాతాల్లోకి రూ.4.86 కోట్లు వడ్డీ రాయితీ నిధులను జమ చేసిన ప్రభుత్వం 
23వ తేదీన వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద జిల్లాలో 72,577 డ్వాక్రా సంఘాల ఖాతాల్లో రూ.66.42 కోట్లు జమ చేసిన ప్రభుత్వం  
28వ తేదీన జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా జిల్లాలో 90,488 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.85.07 కోట్లు జమ చేసిన ప్రభుత్వం 


హెచ్‌పీసీఎల్‌లో జరిగిన ప్రమాదంలో ఎగిసిపడుతున్న మంటలు 

మే 
13న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద 3.86 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.289.88 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. 
14వ తేదీన కోవిడ్‌ బాధితుల కోసం ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో షీలానగర్‌ ప్రాంతంలో వికాస్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన 300 ఆక్సిజన్‌ బెడ్ల కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. 
18వ తేదీన వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకంలో భాగంగా జిల్లాలో 22,366 మంది మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున జమ చేసిన ప్రభుత్వం. 
20వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం. 
25వ తేదీన మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్‌లో సీడీ–3 ప్లాంట్‌లో అగ్ని ప్రమాదంతో ఎగసిన మంటలను 8 ఫైర్‌ ఇంజిన్లతో గంటలో అదుపులోకి తీసుకువచ్చిన యంత్రాంగం. 
25వ తేదీన సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృతి, ఎనిమిది మంది గల్లంతు. 
25వ తేదీన వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద జిల్లాలో రూ.8.54 కోట్లు పరిహారంగా 14,652 మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. 
30వ తేదీన హుకుంపేట మండలం తీగలవలస సమీపంలో ఉన్న గుడ్డిగుమ్మి జలపాతంలో ఈతకు వెళ్లి మృతి    చెందిన ముగ్గురు యువకులు. 
31వ తేదీన అనకాపల్లిలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

జగన్నన కాలనీకి శంకుస్థాపన

జూన్‌
1న అచ్యుతాపురం సెజ్‌లో అంతర్జాతీయ పరిశ్రమలు సెయింట్‌ గోబిన్, గోల్డ్‌ప్లస్‌ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రణాళికల కమిటీ ఆమోదం. 
3వ తేదీన వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో తొలి దశ గృహ నిర్మాణాలు ప్రారంభం. 
4వ తేదీన కథా దిగ్గజం కాళీపట్నం రామారావు(కారా మాస్టారు) మృతి  
8వ తేదీన జగనన్న తోడు రెండో దఫాలో జిల్లాలో 35,186 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.35.19 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. 
15వ తేదీన వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలో 33,494 మంది ఆటోడ్రైవర్ల ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున రూ.33.49 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. 
16వ తేదీన కొయ్యూరు మండలంలో తీగలమెట్ట గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టుల మృతి. 
22వ తేదీన వైఎస్సార్‌ చేయూత పథకం కింద రెండో దఫాలో జిల్లాలో 1,99,695 మంది మహిళల ఖాతాల్లో రూ.374.42 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. 
26వ తేదీన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సతీసమేతంగా విశాఖకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. 
26వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ సంయుక్తంగా 2019–20కు సంబంధించి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అర్బన్‌ ప్లానింగ్, గ్రీన్‌ కవర్‌ అండ్‌ బయోడైవర్సిటీ విభాగంలో విశాఖ 5 స్టార్‌ రేటింగ్‌ను చేజిక్కించుకుంది. 


అనకాపల్లి వద్ద ఫ్లైవోవర్‌ కూలి ధ్వంసమైన లారీ 

జూలై 
6వ తేదీన అనకాపల్లి జలగలమదుం వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలి కారు, ట్యాంకర్‌పై పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు. 
17వ తేదీన నామినేటెడ్‌ పదవుల్లో జిల్లాకు ప్రాధాన్యం కల్పిస్తూ 11 మందికి పోస్టుల కేటాయింపు. 
22వ తేదీన వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా జిల్లాలో 21,177 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.31.76 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. 
26వ తేదీన బీచ్‌ రోడ్డులో విక్టరీ ఎట్‌ సీ వద్ద కార్గిల్‌ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు నివాళులు అర్పించిన నేవీ అధికారులు, సిబ్బంది. 
27వ తేదీన జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌ సీపీ  
28వ తేదీన జిల్లా 124వ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున. 
29వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ రెండో విడత కింద ప్రభుత్వం రూ.59.96 కోట్లను 96,403 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ.  
29వ తేదీన వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ అభ్యంతరాల పరిశీలనకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. 
29వ తేదీన జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడి విద్యార్థులు, యువతకు శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ‘ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌. 
30వ తేదీన జీవీఎంసీ ఎన్నికలో రెండో డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కటుమూరి సతీష్‌కుమార్‌. 

ఉక్కు ఉద్యమంలో మేము సైతం అంటున్న చిన్నారులు

ఆగస్ట్‌ 
10వ తేదీన వైఎస్సార్‌ నేతన్న హస్తం మూడో విడత కింద జిల్లాలో 246 మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.60.96 లక్షలు జమ చేసిన ప్రభుత్వం. 
19వ తేదీన వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అక్కరమాని విజయనిర్మల, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కె.కె.రాజు  
 24వ తేదీన 20 వేలలోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులు 94,560 ఖాతాల్లోకి రూ.88.29 కోట్లు నగదును జమ చేసిన ప్రభుత్వం.  
29వ తేదీన స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 10 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించిన అఖిలపక్షాలు 
30వ తేదీన స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న రిలే దీక్షలకు 200 రోజులు పూర్తి. 

గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మునిగిన ఎయిర్‌పోర్టు

సెప్టెంబర్‌  
3వ తేదీన జిల్లాలో 487 ఎంఎస్‌ఎంఈల ఖాతాల్లోకి రూ.21.70 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. 
19వ తేదీన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 37 స్థానాలకు గానూ 36 చోట్ల విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు. 
23వ తేదీన యూఎస్‌లో విద్యనభ్యసించాలనే విద్యార్థులకు దిశానిర్ధేశం చేయడంతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్‌ కార్నర్‌ను ప్రారంభించిన అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ రీఫ్‌మన్, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి 
24వ తేదీన విశాఖ పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఠాకూర్‌  
25వ తేదీన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జల్లిపల్లి సుభద్ర. 
27వ తేదీన జిల్లాలో 34.07 సెం.మీ.వర్షపాతంతో బీభత్సం సృష్టించిన గులాబ్‌ తుపాను 
27వ తేదీన కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను నిరసిస్తూ రైతు, ప్రజా సంఘాల పిలుపుమేరకు చేపట్టిన భారత్‌ బంద్‌ విశాఖలో ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. 

స్వచ్ఛ వాహనాలు ప్రారంభిస్తున్న ఎంపీ, మంత్రి, నగర మేయర్, తదితరులు 

అక్టోబర్‌  
7వ తేదీన వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రెండో విడతలో జిల్లాలో 63,991 సంఘాల ఖాతాల్లో రూ.470 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. 
12వ తేదీన రూ.10.11 కోట్లతో 303 ఖాళీ స్థలాల అభివృద్ధి, పరిరక్షణ పనులకు శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. 
12వ తేదీన స్వచ్ఛ విశాఖ లక్ష్యంగా నగరంలో చెత్త సేకరణకు 290 వాహనాలను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి.  
14వ తేదీన జీవీఎంసీ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ). 
20వ తేదీన ‘జగనన్న తోడు’ పథకంలో భాగంగా జిల్లాలో 31,465 మంది చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ వృత్తుల వారి ఖాతాల్లో రూ.1.09 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. 
21వ తేదీన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీచ్‌ రోడ్డులో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు       అర్పించిన సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా, డీఐజీ ఎల్‌.కె.వి.రంగారావు, ఎస్పీ బి.కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు. 
26వ తేదీన వైఎస్సార్‌ రైతు భరోసా కింద 3.74 లక్షల మందికి రూ.88.39 కోట్లు, పీఎం కిసాన్‌ కింద 3.29 లక్షల మందికి రూ.68.85 కోట్లు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి రూ.138.97 లక్షలు బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. 
28వ తేదీన విశాఖలో వేద, సంస్కృతి పాఠశాలకు, భీమిలి మండలం అన్నవరంలో 7 స్టార్‌ లగ్జరీ రిసార్ట్, అదానీ డేటా సెంటర్‌కు 130 ఎకరాల భూములను కేటాయిస్తూ కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం ఆమోదముద్ర. 
30వ తేదీన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ జి.లక్ష్మీ శ. 

విశాఖ–కిరండూల్‌ మధ్య విస్టాడోమ్‌ కోచ్‌తో కూడిన రైలును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

నవంబర్‌  
8వ తేదీన వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌–2041కు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వం. 
9వ తేదీన పాతపట్నం ఎమ్మెల్యే కుమార్తె వివాహ రిసెప్షన్‌ కోసం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు 
16వ తేదీన గులాబ్‌ తుపానుతో పంట నష్టపోయిన 7,684 మంది రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.2.93 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. 
20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌–2021లో తొమ్మిదో ర్యాంక్‌ సాధించిన విశాఖ. 
21వ తేదీన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. 
22వ తేదీన విశాఖపట్నం–కిరండూల్‌ విస్టాడోమ్‌ ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. 
25వ తేదీన నీతి ఆయోగ్‌ వెల్లడించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచించిన ర్యాంకుల్లో దేశంలో ఉన్న నగరాల్లో 18వ స్థానంలో నిలిచిన విశాఖ. 
25వ తేదీన ఎండాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన త్రీ టౌన్‌ సీఐ ఈశ్వరరావు  
26వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి. 
29వ తేదీన కార్తీక మాసం సందర్భంగా ఆర్‌కే బీచ్‌లో కార్తీకమాస దిపోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం. 


తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ను సత్కరిస్తున్న శంకరమఠం నిర్వాహకులు 

డిసెంబర్‌ 
16వ తేదీన తూర్పు నావికాదళం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమితులైన సంజయ్‌ వాత్సాయన్‌. 
16వ తేదీన విశాఖ పర్యటనకు వచ్చిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌. 
17వ తేదీన నగరంలో రూ.247.32 కోట్లతో నిర్మించిన 12 ప్రాజెక్టులను ప్రారంభించిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. 
21వ తేదీన పోర్టు స్టేడియంలో వైఎస్సార్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. 
21వ తేదీన జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. 
25వ తేదీన అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన వీఎంఆర్‌డీఏ పార్కులోకి సందర్శకులకు అనుమతించిన వీఎంఆర్‌డీఏ అధికారులు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top