హిజ్రాతో సహజీవనం.. ఆపై హత్య | transgender woman after dispute | Sakshi
Sakshi News home page

హిజ్రాతో సహజీవనం.. ఆపై హత్య

May 2 2026 9:08 AM | Updated on May 2 2026 9:08 AM

transgender woman after dispute

ప్రకాశం జిల్లా: హిజ్రాతో రెండేళ్లపాటు సహజీవనం చేసిన వ్యక్తి అనుమానంతో కడతేర్చిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది. డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపిన ప్రకారం... ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పెదలాటరపికి చెందిన పొట్లూరి అంకయ్య ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డికాలనీకి చెందిన రాపూరి పేరయ్య అలియాస్‌ పేరమ్మ అలియాస్‌ ప్రియ (26)తో పరిచయమై, ఇద్దరూ సహజీవనం చేశారు. 

ఇటీవల ప్రియ మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతుందంటూ అంకయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మాట్లాడాలంటూ ప్రియని గతనెల 27న కందుకూరుకు రప్పించాడు. పట్టణంలోని పోతురాజుమిట్ట వద్ద నివాసం ఉంటున్న అంకయ్య పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుందాం అంటూ ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ప్రియ గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత  హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. 

డాక్టర్లు చనిపోయిందని చెప్పడంతో మరో అంబులెన్స్‌ మాట్లాడుకుని ప్రియ తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించి ఉడాయించాడు. అయితే ప్రియ మెడపై గాయాలు ఉండటంతో అనుమానించిన ఆమె తండ్రి అంజయ్య కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు అంకయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement