సాక్షి, మదనపల్లె: పదవ తరగతి పరీక్షల్లో హైసూ్కల్ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరిని విమానంలో ప్రయాణం చేయిస్తానని చెప్పిన బి.కొత్తకోట మండలం గోళ్లపల్లె హైసూ్కల్ హెచ్ఎం శాంతకుమారి చెప్పినట్టుగానే ఇద్దరు విద్యార్థులకు విమానంలో ప్రయాణం చేయించారు. పదవ తరగతి పరీక్షల్లో గుడిసెవారిపల్లెకు చెందిన విద్యార్థి వరుణ్సందేశ్రెడ్డి, చందనలు 600 మార్కులకు 555 మార్కులు సాధించారు.
హైస్కూల్ ఫలితాల్లో ఈన ఇద్దరే ప్రథమం కావడంతో బుధవారం హెచ్ఎం శాంతకుమారి విద్యార్థులతో కలిసి తిరుపతి నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తొలిసారి విమానం ఎక్కి ప్రయాణించి విద్యార్థులు ఈ అనుభూతిని మరచిపోలేమని, హెచ్ఎం ప్రోత్సాహంతోనే ఈ అవకాశం దక్కిందని అన్నారు. విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలన్న తపనతోనే విమాన ప్రయాణం కల్పించినట్లు శాంతకుమారి చెప్పారు. దీనిపై ఎంఈవో రెడ్డిశేఖర్ హెచ్ఎంను, విద్యార్థులను అభినందించారు.


