సాక్షి, విజయవాడ: టీడీపీకి ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు షాకిచ్చారు. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ ఎమ్మెల్యేకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం గురించి డబ్బా కొట్టడానికి వెళ్లిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడ్డంగా బుక్కయ్యారు. గొల్లపూడిలో ఎంపీపీ పాఠశాల తనిఖీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. మీ కోసమే మధ్యాహ్నభోజనంలో మంచి ఆహారాన్ని అందిస్తున్నామంటూ ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు.
ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం నాసికరంగా ఉందన్న విద్యార్థులు.. చిక్కీల్లో పురుగులు కూడా వస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే మైలవరంలోని తారకరామా నగర్ ఎంపీపీ స్కూల్లో మధ్యాహ్న భోజనంపై తీవ్ర విమర్శలు రాగా, స్కూల్ హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టర్ను మార్చింది. తాజాగా మరో స్కూల్లో చిక్కీలపై ఫిర్యాదు రావడంతో టీడీపీ ఎమ్మెల్యే కంగుతిన్నారు.


