
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న నారాయణమూర్తి, ఇతర నేతలు
కారులో వచ్చి తాటికాయలు విసిరి పరారైన దుండగులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
మండిపడ్డ వైఎస్సార్సీపీ నేత నారాయణ మూర్తి
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
వైఎస్ జగన్కు తక్షణమే జెడ్+ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్
తాడేపల్లి రూరల్: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంపై దుండగులు మరోసారి దాడికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ ఇంటి వద్దకు శనివారం సాయంత్రం కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు గేటు ముందు కారు ఆపి లోపలకు తాటికాయలు విసరడం కలకలం రేపింది. జగన్ ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో ఇదంతా రికార్డయింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల కాలంలో ఇది నాలుగోసారి. జగన్ ఇంటివద్ద, ఆయన పర్యటన సమయంలోనూ భద్రత కల్పించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఇంటివద్ద కూడా తూతూమంత్రపు భద్రతే ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీస స్పందన కూడా కనిపించలేదు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ ఇచ్చినా తాడేపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో ఆయన వాహనానికి ముందు రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీలు కనిపించడం లేదు. మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన రక్షణ కల్పించటం లేదని ధ్వజమెత్తుతున్నారు.
భద్రతా లోపం వల్లే ఇలాంటి ఘటనలు
తాజా దాడిపై వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసంపై ఇద్దరు యువకులు కారులో వచ్చి ఇంటి లోపలికి తాటికాయలు విసిరినట్టు తెలిపారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పారిపోయారన్నారు. మాజీ ముఖ్యమంత్రులకు జెడ్+ కేటగిరీ కల్పించాల్సి ఉన్నా.. వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. లోకేశ్, చంద్రబాబు చెప్పిందే పోలీసులు చేస్తున్నారని, ఆయన ఎక్కడ పర్యటించినా ఈ భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ నివాసంపై దాడి చేశారని తాడేపల్లి పోలీస్స్టేషన్కు వెళితే.. టీడీపీ, జనసేన నేతలను సీఐ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారే తప్ప తమ ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అనంతరం ఎక్నాలెడ్జ్మెంట్ అడిగితే ఇవ్వమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. డీజీపీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినపుడు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటున్నామని, కానీ తాడేపల్లి పోలీసుల తీరు విచిత్రంగా ఉందని అన్నారు.
మాజీ సీఎం నివాసంపై దాడి జరిగిందంటే ఒక పోలీస్ అధికారి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడటం ప్రజాస్వామ్యంపై వారికి ఎటువంటి భావం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లిన వారిలో మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నాగార్జునరెడ్డి, బూత్ కమిటీల అ«ధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఉన్నారు.