
సీఎంగా పరిపాలన కాలంలో నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన రోజు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 12
మా హయాంలో ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం
ఇందులో 2023 సెప్టెంబర్ 15న 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం
ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం సంతోషాన్ని కలిగించింది
వాటితోపాటు పాడేరు, పులివెందుల కాలేజీలనూ అడ్మిషన్లకు సిద్ధం చేశాం
మిగిలిన 10 కాలేజీల పనులను పూర్తి చేయాల్సిన ప్రభుత్వం... వాటిని ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించడం దారుణం
తక్షణమే ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 2023 సెప్టెంబర్ 15వ తేదీ ఒక గొప్ప రోజు అని, ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో తనకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు.. అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తొలి విడతగా ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించి సోమవారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెపె్టంబర్, 2023 ఒక గొప్ప రోజు.
ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంక ల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశాం.
ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం నాకు సంతోషాన్ని కలిగించింది. వీటితోపాటు పాడేరు, పులివెందుల కాలేజీలను కూడా అడ్మిషన్లకు సిద్ధం చేశాం. మిగిలిన కాలేజీల పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ వైఎస్ జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.
