సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో 34 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది.
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోకి రాగానే బస్సులో కాలిన వాసన వస్తుండటంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలుపుతుండగానే ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ నాగరాజు బస్సులోని ప్రయాణికులందరినీ కిందకి దించాడు. ఆగ్నిమాపక వాహనం వచ్చేసరికి బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.
మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయిన సంగతి తెలిసిందే. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు.


