నేడు పిడుగులతో కూడిన వర్షాలు | Rains Lash Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేడు పిడుగులతో కూడిన వర్షాలు

May 31 2026 5:28 AM | Updated on May 31 2026 5:28 AM

Rains Lash Andhra Pradesh

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదివారం విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వివరించారు. దీని ప్రభావంతో ఆది­వా­రం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లోనూ చెదురు మదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.  

అత్యధికంగా 51 మిల్లీమీటర్ల వర్షపాతం  
శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి అనంతపురం జిల్లా హుస్సేన్‌పురంలో 51 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. కడప జిల్లా పెద్దపసుపల్లెలో 45, చిత్తూరు జిల్లా గంగవరంలో 41.7, అనంతపురం జిల్లా వెన్నపూసపల్లెలో 31.5, కడప జిల్లా ఉప్పలూరులో 29, తొర్రివేముల 26, పొత్తిపాడులో 26, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 20.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. వర్షాల ప్రభావంతో ఆదివారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఆదివారం 17 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement