‘‘అందుకే చంద్రబాబు పాత కథనే మళ్లీ తెరమీదకు తెచ్చారు’’ | Rachamallu Siva Prasad Reddy on Liquor Scam Allegations | Sakshi
Sakshi News home page

‘‘అందుకే చంద్రబాబు పాత కథనే మళ్లీ తెరమీదకు తెచ్చారు’’

May 30 2026 5:49 PM | Updated on May 30 2026 5:49 PM

Rachamallu Siva Prasad Reddy on Liquor Scam Allegations

వైఎస్సార్‌ జిల్లా: చంద్రబాబు నాయుడు ఈ రెండేళ్లలో ఏపీని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫమయ్యారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. సంపద సృష్టించి దాన్ని పేద ప్రజలకు పంచుతానన్న మాట గాలిమాటగా మిగిలిపోయిందని విమర్శించారు.

రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వ వైఫల్యాలపై మా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పెద్ద ఎత్తున జూన్‌ 4 నుంచి నిరసన కార్యక్రమాలు ప్రకటించారు. ఈ తరుణంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు మళ్లీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ తెరమీదకు తెచ్చారు. దీనిలో భాగంగానే పాత కథనే.. మళ్లీ లిక్కర్‌ స్కాం అంటూ తెరమీదకు తెచ్చారు. వైఎస్‌ జగన్‌ను నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

అసలే స్కామే లేనిచోట స్కాం అంటారు.. సంబంధం లేని వారినందరినీ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఏ ఆధారం లేకపోయినా చంద్రబాబు నియమించిన సిట్‌ ఏదో ఒక విధంగా మావాళ్లను ముద్దాయిలుగా చూపించి జైలుకు పంపింది. మిథున్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి అందరికీ బెయిల్‌ వచ్చింది. చంద్రబాబు  నమ్మదగిన మిత్రుడు కాదని, ఇన్‌స్టాంట్‌ కాఫీ లాంటివాడేనని పవన్‌ కల్యాణ్‌కు అమిత్‌ షా స్పష్టంగా చెప్పారు.

వైఎస్‌ జగన్‌ దీర్ఘకాలికంగా స్నేహం చేయడానికి అర్హత కలిగిన వ్యక్తి అని అమిత్‌ షా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకులందరూ మనకు వ్యతిరేకులు కానవసరం లేదని ఆయన చెప్పి పంపించారు. వైఎస్‌ జగన్‌తో ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో వారందరికీ నోటీసులిచ్చి విచారణ పేరుతో వేధిస్తూనే ఉన్నారు. 

వ్యాపారంలో రూ.19 కోట్ల  బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా లావాదేవీలు జరిగితే ఏ రకంగా అది లిక్కర్‌ స్కాంకు సంబంధం? కేఎన్నార్‌ 2007 నుంచీ ఇన్‌కం టాక్స్‌ చెల్లిస్తూ ఉన్నారు. ఆయన ఆర్ధిక లావాదేవీలన్నీ లీగల్‌గానే ఉంటాయి. ఎవరైనా చూసుకోవచ్చు. కేఎన్నార్‌ బాద్యత ఏంటి..? అతని స్థాయి ఏంటి..? దీనిలో అతనికి ఏం సంబంధం..? చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ లక్షల కోట్లకు ఏ విధంగా అధిపతి కాగలిగారు? రెండెకరాల నుంచి రూ.లక్ష కోట్లకు చంద్రబాబు అధిపతి అయినప్పుడు కేఎన్నార్‌ లాంటి వారు రూ.20 కోట్లు సంపాదించడం తప్పా..? 

పచ్చళ్లు అమ్ముకున్న రామోజీరావు...ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? రామోజీరావు చిట్‌ఫండ్‌ పేరుతో ఖాతాదారుల సొమ్ముతో వ్యాపారాలు చేయలేదా? సైకిల్‌పై కిరసనాయిల్‌ అమ్ముకునే రాధాకృష్ణ ఇవాళ కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? రాదాకృష్ణకు ఫిలిమ్‌ నగర్‌లో ఉన్న బిల్డింగు చూస్తే ప్రజలు అవాక్కవుతారు. 

హైటెక్‌ సిటీలో తాడు బొంగరం లేని వాళ్లు కూడా వందల ఎకరాలు ఎలా కొనుగోలు చేశారు..?  టీవీ5 నాయుడు ఎక్కడ ప్రారంభం అయ్యారు..ఇప్పుడు ఎక్కడున్నారు..? ఇప్పుడు కేఎన్నార్‌ను ఈ డబ్బు ఎలా వచ్చిందని అడిగే సిట్‌ అధికారులు చంద్రబాబు అండ్‌ కోను కూడా ఇలానే ప్రశ్నిస్తారా? పీఏల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసే సంస్కృతి జగన్‌కు లేదు. ఇప్పటి వరకు లిక్కర్‌ స్కాం విచారణలో ఏ సాక్ష్యమే మీదగ్గర లేదు’’ అని అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement