= తన భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటూ...అతనితో కలిసి తనపై దాడి చేస్తోందని పుట్టపర్తి మండలం జగరాజుపల్లికి చెందిన ఓ యువకుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనకు విడాకులు కావాలని అడిగినా... ఆమె ఒప్పుకోవడం లేదని... కాపురం చేస్తానని చెబుతూనే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోయాడు. పైగా తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తోందని, పోలీసులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తూ తనకే కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
= ముదిగుబ్బ మండలానికి చెందిన ఓ యువతి తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి రెండు వారాల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చింది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. తనను ఇబ్బందులు పెడుతున్నాడని కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు నమోదు చేయాలని, లేదంటే తనతో విడాకులకు ఒప్పుకునేలా అతడిని మార్చాలని కోరింది. లేకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని వాపోయింది.
...ఇలా ప్రతి వారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు కుటుంబ సమస్యల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా అందే అర్జీల్లో 20 శాతానికి పైగా కుటుంబ కలహాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఏ కేసును పరిశీలించినా.. దంపతుల మధ్యలోకి మరో వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. బంధం భారమనుకుంటున్న వారు వీలైనంత త్వరగా బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సాక్షి, పుట్టపర్తి: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండాలని వేద మంత్రాల సాక్షిగా వివాహం చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ఏడడుగులు నడిచి.. ఏడాది గడవక ముందే ఎన్నో జంటలు విడిపోతున్నాయి. పెళ్లయిన మొదటి రోజు నుంచే విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్న వారూ ఉన్నారు. మరికొందరు పిల్లలు పుట్టినా.. కలిసి ఉండలేక వేర్వేరుగా జీవితం వెళ్లదీస్తున్నారు. దంపతుల మధ్య తలెత్తుతున్న వివాదాలు చిన్నారుల భవితను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వివాహేతర సంబంధాలతోనే..
దంపతుల మధ్య సయోధ్య కుదరక.. సర్దుకుపోయే గుణంలేక.. పెద్దల మాట లెక్క చేయక.. ప్రతి వారం కనీసం పది జంటలు పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని.. కలిసి ఉండలేమని.. వేరుగా జీవించేందుకు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇందులో వివాహేతర సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. భార్య లేదా భర్త.. అవతలి వ్యక్తిపై చేసే ఫిర్యాదులో కచ్చితంగా మరొకరితో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో దంపతుల మధ్య విభేదాలకు సంబంధించి కొందరు ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు విడాకులు కోరుతూ న్యాయవాదుల వద్దకు వెళ్తున్నారు. సర్దుకుపోయే తత్వంలేక నిత్యం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు.
అనాలోచిత నిర్ణయంతో.
ఆకర్షణో.. ప్రేమో అర్థం చేసుకోలేక, ఆలోచించే పరిపక్వత లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొత్త దాంపత్య జీవితంలో ఇష్టంగా అడుగు పెట్టినా.. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకుని గొడవ పడుతున్నారు. ఆలోచన లేని ఆవేశంతో విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దలలు జోక్యం చేసుకుని సర్దిచెప్పినా పరిస్థితి చక్కబడటం లేదు.
సర్దుకుపోతే మంచిది
ప్రతి మనిషికీ తోడు ఎంతో అవసరం. మంచి, చెడులను వివరించి చెప్పగలిగే స్నేహితుడు దొరికితే వారు చాలా అదృష్టవంతులు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్నేహితులుగా భావించాలి. అప్పుడే వారికి కలిగే చిన్న చిన్న సమస్యలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఏదైనా సమస్య తలెత్తితే కుటుంబ పెద్దలకు చెప్పి.. ఇంట్లోనే సర్దుకుంటే మంచిది.
– సతీష్ కుమార్, ఎస్పీ, శ్రీసత్యసాయి జిల్లా


