మధిర: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతూ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం సమీపంలోని కట్టలేరుపై ఉన్న బ్రిడ్జి నాలుగేళ్ల కిందట వరద ఉధృతికి కొట్టుకుపోయిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జగన్ను కలిసిన వారిలో భద్రాచలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నారు.