
జిల్లాలో ఎంపీ బైరెడ్డి శబరి పెత్తనాన్ని సహించేది లేదంటున్న ఎమ్మెల్యేలు
మద్దూరు సీహెచ్సీలో తన వర్గం వారినే నియమించాలని ఎమ్మెల్యే చరిత హుకుం
ఎంపీ సిఫార్సు చేస్తే ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వొద్దంటూ సిమెంట్ కంపెనీలకు మంత్రి ఆదేశాలు!
తాజాగా తర్తూరు జాతరలోనూ ఎమ్మెల్యే గిత్తా జయసూర్యదే పైచేయిగా నిలిచిన వైనం
ఆళ్లగడ్డలో ఇంతవరకు అడుగుపెట్టలేకపోయిన ఎంపీ
జిల్లాలో కూటమి ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత కొరవడింది. ఎంపీతో ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదు. తమ నియోజకవర్గాల్లో తమకు సమాచారం ఇవ్వకుండా పర్యటిస్తే సహించేది లేదని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంపీ, ఆమె తండ్రి పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దీంతో ఎంపీ ఏకాకిలా మిగిలిపోయారనే విమర్శలు జోరందుకున్నాయి.
సాక్షి, నంద్యాల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తమ పరిధిలో పోస్టింగులు, కాంట్రాక్టులు, కమీషన్ల విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
గౌరు చరిత వర్సెస్ శబరి
పాణ్యం మండల పరిధిలోని మద్దూరు పీహెచ్సీలో నైట్ వాచ్మన్, స్వీపర్ పోస్టుల విషయమై ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య నిప్పు రాజుకున్నట్లు సమాచారం. ఎంపీ వర్గమైన నతానియేల్(వాచ్మన్), ఓ సుబ్బమ్మ(స్వీపర్)లను ఎమ్మెల్యే వర్గం వారు పట్టుబట్టి గతేడాది నవంబర్లో సస్పెండ్ చేయించారు. ఏ తప్పు చేయకున్నా తమ వారిని ఎందుకు సస్పెండ్ చేశారని, వారినే ఆయా పోస్టుల్లో కొనసాగించాలని ఎంపీ శబరి జిల్లా వైద్యాధికారులను ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో మూడు నెలల పాటు వాచ్మెన్, స్వీపర్లు లేకుండా సీహెచ్సీ నడిసింది. ఈ విషయం ఎమ్మెల్యే గౌరు చరిత దృష్టికి వెళ్లడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి ఆమె వర్గానికి చెందిన చాకలి వెంకట సుబ్బయ్య, కె. వెంకటమ్మలను తాత్కాలికంగా నియమించారు.
ఆ లేఖలు పక్కన పడేయండి!
ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారికి బనగానపల్లెలోని సిమెంట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఎంపీ శబరి సిఫార్సు చేశారు. అయితే ఆయా కంపెనీలు ఎంపీ సిఫార్సులను చెత్త బుట్టలో వేసినట్లు సమాచారం. ఆమె రెఫర్ చేసిన ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వడం లేదని తెలుస్తోంది. అలాగే పరిశ్రమల్లో కాంట్రాక్టు పనులను తమ వారికి ఇవ్వాలని రెఫర్ చేస్తే వాటిని యాజమాన్యం బుట్టదాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే వీటి వెనక మంత్రి బీసీ జనార్దన్రెడ్డి హస్తం ఉన్నట్లు ఎంపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
నందికొట్కూరులో మరీ దారుణం
ఎంపీ సొంత నియోజకవర్గమైన నందికొట్కూరులో నూ ఆమె మాట చెల్లుబాటుకావడం లేదు. పోలీసుల పోస్టింగ్లు, స్టేషన్లలో పంచాయితీలు, రెవెన్యూ కార్యాలయాల్లో రెకమెండేషన్లు... ఇలా ఎక్కడికి వెళ్లినా అధికారుల నుంచి ‘నో’ అనే సమాధానమే వస్తోంది. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎంపీ వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ పదవి రాలేదు. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మాండ్ర శివానందరెడ్డి వర్గానికి చెందిన వీరం ప్రసాద్రెడ్డి నియమితులయ్యారు. అలాగే జిల్లాలో వైభవంగా నిర్వహించే త ర్తూరు జాతర నిర్వహణ విషయంలో ఎంపీ వర్గీయుల మాటను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి వర్గంలోకి వెళ్లిన 11 మంది కౌన్సి లర్లు మాండ్ర వర్గంలోకి జంప్ చేయడం గమనార్హం.
ఒక్క మండలానికే పరిమితం...
బైరెడ్డి రాజశేఖరరెడ్డి పెత్తనంతో ఎంపీ కేవలం ఒక్క మండలానికే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె స్వగ్రామం ముచ్చుమర్రి ఉన్న పగిడ్యాల మండలంలో మాత్రమే ఆమె చెప్పినట్లు నడుస్తోంది. మిగిలిన నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ ఆమె చెప్పినట్లు నడవడం లేదని ఎంపీ అనుచరులే చర్చించుకుంటున్నారు. మరోవైపు శ్రీశైలం, డోన్ నియోజకవర్గాల్లోనూ ఆమె పెద్దగా పర్యటించడం లేదు. ప్రైవేటు కార్యక్రమాలకు ఎవరైనా ఆహా్వనిస్తే ఇలా వెళ్లి అలా వచ్చేస్తున్నారు.
విభేదాలు బహిర్గతం
సార్వత్రిక ఎన్నికల్లోనే భూమా అఖిలప్రియ... బైరెడ్డి శబరి మధ్య మనస్పర్థలు ప్రస్ఫుటంగా కనిపించాయి. నంద్యాల ఎంపీ అభ్యరి్థగా అఖిల భర్త భార్గవరామ్ నామినేషన్ వేయడంతో ఒక్కసారిగా వీరి మధ్య భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వరకు భార్గవ్ రామ్ తన నామినేషన్ను విత్డ్రా చేసుకోలేదు. టీడీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు.
అయితే ఎన్నికల సమయంలో తాము కోరిన మొత్తాన్ని ఎంపీ అభ్యర్థి ఇవ్వకపోవడంతో బెదిరించడానికి ఇలా డ్రామా ఆడినట్లు అప్పుడే జిల్లాలో జోరుగా చర్చ సాగింది. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎంపీ బైరెడ్డి శబరి ఒకరినొకరు చూసుకున్నది లేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంపీ అడుగు పెట్టలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎంపీ పాల్గొనడం లేదు. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీకి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. అయితే కొన్ని నెలల కిందట శిరివెళ్లలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరై ఒక గంట మాత్రమే ఉండి వెళ్లిపోయారు.
ఉనికి పాట్లు
ఎంపీగా బైరెడ్డి శబరి గెలిచినప్పటికీ ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నీ తానై వ్యవహరించారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఎంపీ చురుగ్గా వ్యవహరించడం లేదని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి విషయంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి చొరవ చూపుతున్నారని ఆరోపించారు. అన్ని శాఖల అధికారులు తాను చెప్పింది చేయాలంటూ హుకుం జారీ చేయడంతో పాటు నియోజకవర్గంలో తానే అసలైన ప్రజాప్రతినిధిగా నడుచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాణ్యం నియోజకవర్గంలోనూ తలదూర్చి అక్కడ కూడా వర్గ రాజకీయాలు చేయడం ప్రారంభించడంతో టీడీపీ నాయకులు అధి ష్టానానికి వరుసగా ఫిర్యాదులు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి రాజశేఖరరెడ్డి సై లెంట్ అయ్యారు. అప్పుడప్పుడు తాను ఒకడిని ఉన్నానని ఉనికిని కాపాడుకునేందుకు రా జకీయ విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నా రని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.