
గాయాలతో బాధితులు
ఇద్దరు మహిళలు సహా యువకుడిపై రెచ్చిపోయిన ఎస్సై వలీబాషా
బూటు కాలితో తన్నడంతో విరిగిన మహిళ దంతాలు.. మెడ పట్టుకుని మెట్లపై నుంచి కిందకు తోసేసిన వైనం
పుట్టపర్తి టౌన్/గాండ్లపెంట: ఇద్దరు మహిళలపై శ్రీసత్యసాయి జిల్లా నంబులపూలకుంట ఎస్ఐ వలీబాషా రెచ్చిపోయారు. ఓ కేసు విషయంలో మహిళలతో పాటు యువకుడిని విచక్షణారహితంగా చితకబాదారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు, బెల్టుతో కొట్టడమే కాకుండా బూటుకాళ్లతో తన్నారు. దీంతో ఓ మహిళకు రెండు దంతాలు విరిగిపోయాయి. ఈ ఘటనపై బాధితులు శనివారం ఎస్పీ కార్యాలయానికి చేరుకుని స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. నంబులపూటకుంటకు చెందిన ప్రశాంత్, రమణ, రఫీ శుక్రవారం ఒకరిపై ఒకరు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే రమణను ప్రశాంత్ అనే వ్యక్తి ‘ఒరేయ్ మామా’ అని సంబోధించాడు. ఈ మాట విన్న రఫీ భార్య హసీనా తన భర్తను ఉద్దేశించి అలా వ్యంగ్యంగా పిలిచాడంటూ ప్రశాంత్తో గొడవకు దిగింది. ప్రశాంత్కు మద్దతుగా అతడి తల్లి పార్వతమ్మ, అమ్మమ్మ వెంకటలక్ష్మమ్మ రావడంతో అందరూ గొడవపడ్డారు. తర్వాత హసీనా భర్త రఫీ నంబులపూటకుంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వలీబాషా సూచన మేరకు కానిస్టేబుల్ వెళ్లి ప్రశాంత్ను స్టేషన్కు రావాలని చెప్పారు. ప్రశాంత్తో పాటు అతడి తల్లి పార్వతమ్మ, అమ్మమ్మ వెంకటలక్ష్మమ్మ కూడా స్టేషన్కు వెళ్లారు. ఏం జరిగిందనే విషయం కూడా తెలుసుకోకుండా ఎస్ఐ వలీబాషా ఆ ముగ్గురినీ నోటికి వ చ్చినట్టు దుర్భాషలాడారు.
స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండటంతో ఆ ముగ్గురినీ పైగదిలోకి తీసుకువెళ్లి ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ లాఠీలు, బెల్టుతో చితకబాదారు. మహిళలని కూడా చూడకుండా పార్వతమ్మ, లక్ష్మమ్మను ఎస్ఐ బూటు కాళ్లతో తన్ని, మెడ పట్టుకుని మెట్లపై నుంచి కిందకు తోసేశారు. బూటుకాలితో తన్నడంతో పార్వతమ్మకు రెండు దంతాలు విరిగిపోయాయి. వెంకటలక్ష్మమ్మ చెవికమ్మ ఊడిపోయింది. ముగ్గురి చేతులు, కాళ్లు, ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే అంబులెన్స్లో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితులు శనివారం స్థానికంగా న్యాయం జరగదని భావించి ఎస్ఐపై ఫిర్యాదు చేయడానికి పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీ రత్న అందుబాటులో లేకపోవడంతో స్పెషల్ బ్రాంచ్ సీఐ బాల సుబ్రహ్మణ్యంరెడ్డికి ఫిర్యాదు చేశారు.
దండించానంతే..!
ఈ విషయమై ఎస్ఐ వలీబాషా మాట్లాడుతూ.. ప్రశాంత్ గతంలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడని తెలిపారు. అతడు మాదక ద్రవ్యాలకు బానిసగా మారి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించేవాడన్నారు. ఈ విషయంపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతన్ని స్టేషన్కు పిలిపించి దండించానే తప్ప అతనిపైన, కుటుంబ సభ్యులపైన చేయిచేసుకోలేదన్నారు.