
వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేర తగిన చర్యలు తీసుకోండి
ఏడేళ్ల లోపు శిక్షపడే కేసుల్లో కూడా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు
మేజిస్ట్రేట్లు తగిన కారణాలను కూడా వెల్లడించడం లేదు
ఇది అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే
ఇలా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు సుప్రీం చెప్పింది
తమ ఆదేశాల అమలును పర్యవేక్షించాలని కూడా సూచించింది
లోపభూయిష్ట ఉత్తర్వులను తమ దృష్టికి తీసుకొస్తే హైకోర్టుపై చర్యలు తీసుకుంటామంది
అందుకే ఏయే కేసుల్లో నిబంధనలు పాటించలేదో మీ దృష్టికి తీసుకొస్తున్నా
దాని ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోండి–హైకోర్టుకు ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ హరీశ్వర్రెడ్డి
ఈ ఫిర్యాదును సీజే ముందుంచుతామన్న రిజిస్ట్రీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మునగాల హరీశ్వర్రెడ్డి మంగళవారం హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు ఫిర్యాదు చేశారు. వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేర చర్యలు తీసుకోవాలని కోరారు. హరీశ్వర్రెడ్డి తరఫున ఆయన న్యాయవాదులు కాసా జగన్మోహన్రెడ్డి, కె.జానకిరామిరెడ్డి, యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి, పొన్నపురెడ్డి శశివర్థన్రెడ్డి, పాపుడిప్పు శశిధర్రెడ్డి తదితరులు ఫిర్యాదు కాపీని రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు అందజేశారు.
పోలీస్ అధికారులు, అలాగే మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ధిక్కరించి, ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలలోనూ నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు పంపుతున్నారని హరీశ్వర్రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై కూడా తిరుపతి తూర్పు పోలీసులు పలు సెక్షన్ల కింద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని, ఈ సెక్షన్లన్నీ ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడేవేనన్నారు.
అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, మేజిస్ట్రేట్ తగిన కారణాలను వెల్లడించకుండా యాంత్రికంగా తనను రిమాండ్కు పంపారని హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
తమ ఆదేశాల అమలును హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు చెప్పిందితాను కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో జరిగినట్లు తెలిసిందని హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తమ మార్గదర్శకాల అమలును దేశంలోని అన్నీ హైకోర్టులు పర్యవేక్షించాలని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంతేందర్ కుమార్ అన్టిల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు సైతం చెప్పింది..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం బొల్లినేని రాజగోపాల్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొందన్నారు. ‘సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసే ముందు మేజిస్ట్రేట్లు తమ సంతృప్తిని రికార్డ్ చేయాలి. వాస్తవాల విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించి, కారణాలతో కూడిన ఉత్తర్వు ఇవ్వాలి. దీనికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా తీవ్రంగా పరిగణిస్తాం. మేజిస్ట్రేట్లు లోపభూయిష్టమైన రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని నిందితులు కానీ, వారి తరఫున ఇతరులు గానీ హైకోర్టు దృష్టికి తీసుకొస్తే ఆ మేజిస్ట్రేట్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.
ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆదేశాలను ఉల్లంఘించిన విచారణాధికారులు, మేజిస్ట్రేట్ల వివరాలను కేసుల వివరాలతో సహా ఈ ఫిర్యాదుకు జత చేస్తున్నానని, వాటిని పరిశీలించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన రిజిస్ట్రీ దీనిని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచుతామని హరీశ్వర్రెడ్డి న్యాయవాదులకు చెప్పినట్లు తెలిసింది. మొత్తం 149 కేసులకు సంబంధించిన వివరాలను, ఆయా మేజిస్ట్రేట్ కోర్టుల వివరాలను హరీశ్వర్రెడ్డి తన ఫిర్యాదుతో జత చేశారు.