ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం

Perni Nani says Prohibition on private practice of government doctors - Sakshi

సమర్థంగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నిర్వహించిన అధికారులకు అభినందన

మంత్రివర్గం నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ‘నాడు–నేడు’ కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించడంతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్‌ సిబ్బందిని నియమించింది. నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వ డాక్టర్లు సర్కారు ఆసుపత్రుల్లో కంటే ప్రైవేటుగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రజలు భావిస్తుండటం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

ఈ అంశంపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తారని, తద్వారా ప్రజారోగ్యానికి పూర్తి భరోసా కల్పించవచ్చని మంత్రివర్గం అభిప్రాయపడింది. గురువారం వెలగపూడిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్, అధికారులు సమర్థంగా నిర్వహించారని అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 2021–22 ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. 

రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు 
► కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు చేసిన స్వల్ప సవరణలకు మంత్రివర్గం ఆమోదం.
► కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు. చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె మండలాలతో పులివెందుల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు. వైఎస్సార్‌ కడప జిల్లాలో 36 మండలాల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం కొత్తగా పులివెందుల డివిజన్‌ ఏర్పాటు. 
► 12 పోలీసు సబ్‌డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

జెడ్పీలు పూర్తి కాలం యథాతథం 
► ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి యథాతథంగా కొనసాగిస్తూ  పంచాయతీరాజ్‌ చట్టం ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం.
► చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటయ్యే అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌.
► చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మిల్లెట్‌ మిషన్‌ (2022–23 నుంచి 2026–27 వరకు)కు ఆమోదం.
► ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దాదాపు 253 పోస్టులు ఇచ్చేందుకు ఆమోదం. 23 ప్రిన్సిపాల్, 31 టీచింగ్, 199 నాన్‌టీచింగ్‌ పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌.
► ప్రకాశం జిల్లా దర్శిలో నూతన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం. 
► శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌. 
► పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు  కేబినెట్‌ ఆమోదం.
► సర్వే, సెటిల్‌మెంట్స్, భూ రికార్డుల విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు ఆమోదం.

హెల్త్‌ హబ్స్‌కు భూములు 
► రాష్ట్రంలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటులో భాగంగా కాకినాడ అర్బన్‌ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి ఏర్పాటుకు 5 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం.
► కర్నూలు జిల్లా కల్లూరులో అత్యాధునిక ఆసుపత్రి కోసం 5 ఎకరాల భూమి కేటాయింపు.
► విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్‌ హబ్‌ కింద ఏపీఐఐసీ ద్వారా కేటాయింపు.
► అనంతపురం జిల్లా అనంతపురం రూరల్‌ గ్రామంలో 4 ఎకరాల భూమి హెల్త్‌ హబ్‌ కింద ఏర్పాటయ్యే ఆసుపత్రికి కేటాయింపు.
► శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల భూమి హెల్త్‌ హబ్‌ కింద ఏర్పాటయ్యే అత్యాధునిక ఆసుపత్రికి కేటాయింపు.

పలు సంస్థలకు భూ కేటాయింపులు 
► ఏపీ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు హోటల్, కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం రాజమహేంద్రవరం అర్బన్‌లో 6 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం. 
► కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి 100 ఎకరాల కేటాయింపునకు గ్రీన్‌ సిగ్నల్‌. 
► కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు 15.31 ఎకరాల భూమి ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం.
► ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి కేటాయింపు. 
► అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కేటాయింపు. విండ్‌ టర్బైన్‌ జనరేటర్లను నెలకొల్పనున్న ఐఓసీఎల్‌.
► కర్నూలు జిల్లా డోన్‌ మండలం ఉడుములపాడులో ఆగ్రో కెమికల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ విస్తరణకు 10.06 ఎకరాలు కేటాయింపు. 
► కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్‌ నిర్మాణానికి 1.57 ఎకరాల భూమి ఆర్టీసీకి కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం.
► రంపచోడవరం మండలం పెద గడ్డాడలో ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు. 
► నిజాంపట్నం మండలం దిండిలో పరిసవారిపాలెంలో 280 ఎకరాలు మత్స్యశాఖకు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం. ఈ భూమిలో మడ్‌క్రాప్‌ హేచరీస్‌ ప్రాజెక్ట్‌ను మత్స్యశాఖ చేపట్టనుంది.
► కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కు కోసం 82.34 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 
► ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాల కేటాయింపు. 
► గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ కోసం 0.89 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం.
► నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్, మైసూరుకు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top