ఆదోనిలో హెచ్చరిక బోర్డు
ఆదోని రూరల్: తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించేంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకులకు ప్రవేశం లేదని పెద్దహరివాణం గ్రామ ప్రజలు ఆదోని–సిరుగుప్ప ప్రధాన రహదారిలోని పెద్దహరివాణం ప్రవేశంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఆరు రోజులుగా పెద్దహరివాణం మండలాన్ని ప్రకటించాలని రిలే దీక్షలు చేస్తున్న తరుణంలో ఆదివారం వినూత్నంగా ఈ బోర్డును ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆదినారాయణరెడ్డి, మెడికల్ నాగరాజ్, గ్రామ సర్పంచ్ రాముడు, వైస్ సర్పంచ్ మల్లికార్జునరెడ్డి, నాయకులు మధుసూదన్, వీరేష్, చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం కొంతమంది వేరే గ్రామాల నాయకుల స్వార్థం కారణంగా మండలంగా రద్దు చేసి ఆదోని–1, ఆదోని–2గా ప్రకటించి తమ మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించేంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకులను గ్రామంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.


