
కాలువలో శవమై తేలిన వివాహిత
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సంగం(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు): పెరమన గ్రామానికి చెందిన ఓ వివాహిత సంగం మండలం ర్యాంపు వద్ద గల కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో శనివారం సాయంత్రం శవమై కనిపించింది. శుక్రవారం సాయంత్రం తన ఇద్దరు చిన్నారులకు అన్నం పెట్టి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి వస్తానన్న కత్తి లావణ్య (28) రిజర్వాయర్ ప్రధాన కాలువలో శవమై కనిపించడంతో బంధువులు పొగిలి పొగిలి రోదించారు. ర్యాంపు వద్ద మహిళ మృతదేహం లభించిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆమె ఎవరో తెలియక.. యువతి చేతులకు గోరింటాకు, కాలికి మెట్లు, పారాణి కనిపించడంతో నవ వధువులా ఉందని, ఇంతలోనే ఏ కష్టమొచ్చిందో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించారు. ఆ తరువాత మృతురాలి వివరాలు తెలిశాయి. ఆ ప్రకారం..
సంగం మండలం పెరమన గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జగదీష్కు 8 సంవత్సరాల క్రితం ఆత్మకూరు మండలం నువ్వూరుపాడుకు చెందిన కత్తి రమేష్, పెంచలమ్మల కుమార్తె లావణ్యను ఇచ్చి వివాహం చేశారు. వీరికి రెండో తరగతి చదువుతున్న బాబు, అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న పాప ఉన్నారు. వీరి కుటుంబంలో ఏం జరిగిందో ఏమో కానీ శుక్రవారం రాత్రి 7 గంటల తరువాత లావణ్య కనిపించలేదు. దీంతో భర్త జగదీష్, అతని తల్లిదండ్రులు పెరమన గ్రామమంతా వెతికి ఆమె తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు.
శనివారం ఉదయం సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం రిజర్వాయర్ ప్రధాన కాలువలో లావణ్య శవమై కనిపించింది. అంగడికి వెళ్లి వస్తానన్న అమ్మ రాకపోవడంతో అర్ధరాత్రి వరకు చిన్నారులు మారం చేస్తున్నారని జగదీష్ తల్లిదండ్రులు చెప్పిన మాటలు పెరమన గ్రామస్తులను కన్నీరు పెట్టించాయి. సంగం పోలీసులు లావణ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఇన్చార్జి ఎస్సై సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డబ్బులడిగితే తల్లి మందలించిందని..
ఉదయగిరి: తల్లి మందలించడంతో మనస్తాపం చెంది ఫ్యానుకు ఉరి వేసుకుని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉదయగిరి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కాలనీకి చెందిన గాలేటి రమణయ్య, రత్తమ్మ దంపతుల కుమార్తె నవ్య (17). ఫ్రైడ్ రైస్ కోసం బంధువుల ఇంటి వద్ద ఉన్న తన తల్లి దగ్గరకు వెళ్లి రూ.50 నగదు అడిగింది. దీంతో తల్లి తన దగ్గర డబ్బులు లేవని రోజూ ఎలా వస్తాయని మందలించి రూ.20లు ఇచ్చింది. దీంతో ఆ బాలిక మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కొంత సేపటి తర్వాత ఇంటి కొచ్చిన తల్లి తలుపు ఎంత కొట్టినా తీయక పోవడంతో చుట్టు పక్కలవారి సాయంతో గడియ తీసి చూసేసరికి ఉరి వేసుకుని నవ్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో కిందకు దింపి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలిపారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్పై కర్నాటి ఇంద్రసేనారెడ్డి మృతురాలి ఇంటిని పరిశీలించడంతో పాటు వైద్యశాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
వివాహిత అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): వివాహిత అదృశ్యమైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నేపాల్కు చెందిన గగన్, భావన జైషీద్ దంపతులు. వారికి ఆరేళ్ల కిందట వివాహమైంది. ప్రస్తుతం వారు నగరంలోని తులసీ నర్సింగ్హోమ్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 24న భావన ఇంటి నుంచి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. ఈ మేరకు భర్త శనివారం చిన్నబజారు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.