ఇదీ.. మార్గదర్శి మోసాల కథ! 

Margadarsi Scams Illegal collection Of Deposits Of Thousands Of Crores Of Rupees - Sakshi

చట్ట విరుద్ధంగా రూ.వేల కోట్ల డిపాజిట్ల సేకరణ.. అనుబంధ కంపెనీలకు నిధుల మళ్లింపు

రికార్డులు ఇవ్వకుండా, తనిఖీలకు సహకరించకుండా..  డిపాజిట్‌దారులకు మార్గదర్శి తిరిగి చెల్లించేపరిస్థితిలో లేదని విచారణాధికారి నివేదిక

సాక్షి, అమరావతి: హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టం సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లను సేకరించింది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆరి్థక శాఖ దృష్టికి తెచ్చారు. అయితే అక్కడి నుంచి తగిన స్పందన లేకపోవడంతో తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్‌.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అ«దీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 

రంగాచారికి సహకరించని మార్గదర్శి.. 
ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో తన నివేదిక సమరి్పంచారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏమాత్రం సహకరించలేదని నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ భారీ ఎత్తున నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని తెలిపారు.

చట్ట ఉల్లంఘనలపై  అధీకృత అధికారి ఫిర్యాదు... 
మార్గదర్శి అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై అ«దీకృత అధికారి కృష్ణరాజు 2008 జనవరిలో నాంపల్లి మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ కోర్టులో క్రిమినల్‌ ఫిర్యాదు (సీసీ నెంబర్‌ 540) దాఖలు చేశారు. దీన్ని కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి సీసీ 540లో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేయగా సీసీ 540లో తదుపరి చర్యలు కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. అటు తరువాత ఇదే సీసీ 540పై మార్గదర్శి మరో రూపంలో పిటిషన్‌ దాఖలు చేసి హైకోర్టు నుంచి సానుకూలంగా స్టే ఉత్తర్వులు పొందింది. 

స్టే ఇవ్వని సుప్రీంకోర్టు.. ఏకంగా ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు... 
2011లో తిరిగి సీసీ 540ని కొట్టేయాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 482 కింద మార్గదర్శి పిటిషన్‌ దాఖలు చేసింది. ఆర్బీఐ చట్టం సెక్షన్‌ 45(ఎస్‌) కింద తామెలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, క్రిమినల్‌ ఫిర్యాదును కొట్టేయాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైనా కేసులో స్టే కాల పరిమితి ఆరు నెలలు కావడంతో హైకోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసింది. స్టే గడువు పెంపు కోసం మార్గదర్శి 2018లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే స్టే పొడిగింపునకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఇదిలా ఉండగా సీసీ 540ని కొట్టేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు చివరి రోజు అంటే 31.12.2018న జస్టిస్‌ రజనీ మార్గదర్శికి అనుకూలంగా తీర్పు వెలువరించారు. మార్గదర్శి కోరినట్లు సీసీ 540ని కొట్టేశారు. హైకోర్టు విభజన హడావుడిలో ఉన్నప్పుడు వెలువడిన ఈ తీర్పును అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. కొంత కాలం తరువాత అసలు విషయం బయటకు రావడంతో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ రజనీ 2021 సెప్టెంబర్‌లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యున్‌ (ఎన్‌సీఎల్‌టీ) అమరావతి బెంచ్‌ సభ్యురాలిగా నియమితులై ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఆమెకు ఎన్‌సీఎల్‌టీ పోస్టు ఖరారైంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top