కౌతాళంలో లాకప్‌ డెత్‌! | Lockup Death in Kouthalam: andhra pradesh | Sakshi
Sakshi News home page

కౌతాళంలో లాకప్‌ డెత్‌!

Jun 1 2026 5:52 AM | Updated on Jun 1 2026 5:52 AM

Lockup Death in Kouthalam: andhra pradesh

సిట్‌ పోలీసులు కొట్టడం వల్లే మహిళ మృతి? 

ఆదోని: తన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులను, ఆ తరువాత హైకోర్టును ఆశ్రయించిన మహిళ మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా కౌతాళంలో సిట్‌ పోలీసులు కొట్టడం వల్లే మాల గంగమ్మ అనే మహిళ మరణించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024 నవంబర్‌ 13న పొలానికి మందులు పిచికారీ చేయడానికి వెళ్లిన తన కుమారుడు మాల రవీంద్ర ఇంటికి తిరిగి రాలేదని అతడి తల్లి గంగమ్మ కౌతాళం పోలీసులను ఆశ్రయించింది. అయితే, కౌతాళం పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినా.. దర్యాప్తు చేయకుండా చేతులు దులుపుకున్నారని గంగమ్మ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం విచారణకు ఆదేశించగా.. గుంటూరు ఎస్పీ ఆధ్వర్యంలో సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటైంది.

కాగా.. సిట్‌ అధికారులు విచారణ పేరిట మాల గంగమ్మను విపరీతంగా కొట్టడం వల్లే ఆస్పత్రి పాలై మరణించినట్టు సమాచారం. ఆమె మరణంతో కంగుతిన్న పోలీసులు పోస్టుమార్టం చేయించకుండా మృతదేహానికి దహన సంస్కారాలు ముగించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఈ కేసు లాకప్‌ డెత్‌ రూపంలో తమ మెడకు చుట్టుకుంటుందన్న భయంతో సిట్‌ పోలీసులు ముందుజాగ్రత్తగా గంగమ్మ కుమార్తె నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. గంగమ్మ ఇంటివద్ద ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో చికిత్స నిమిత్తం ఆస్పతికి తీసుకు వచ్చినట్టు, చికిత్స పొందుతూ గంగమ్మ మరణించినట్టు పోలీసులు ఆమె కుమార్తె నుంచి వాంగ్మూలం రాయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement