సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ పక్క వరుణుడు కాలం కాని కాలంలో వర్షాలు కురిపిస్తుండగా, మరో పక్క భానుడు భగభగమంటున్నాడు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 5.9 సెంటీమీటర్ల వర్షం కురవగా, దక్షిణ కోస్తాలోని మార్కాపురంలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.2, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1, చిత్తూరు జిల్లా సింధురాజపురం, నెల్లూరు జిల్లా నెల్లూరు పాలెంలో 42.6, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 42.2, ఎన్టీఆర్ జిల్లా చందాపురం, కడప జిల్లా ఒంటిమిట్టలో 41.9, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 41.2, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 155 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు అనకాపల్లి జిల్లా రాజంలో 5.4, చూచుకొండలో 3.9, అనకాపల్లిలో 3.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.️


