
కర్నూలు: పూటుగా మద్యం తాగి పొర్లుతున్న ఈ దృశ్యాలు కూటమి పాలన తీరుకు అద్దం పడుతున్నాయి. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారా వ్యాపారాన్ని కొనసాగిస్తూ పేదల ఒళ్లు, ఇళ్లను గుళ్ల చేస్తోంది. డోర్ పట్టణంలో ఎక్కడ చూసినా మద్యం మత్తులో రోడ్లపై పడివున్న మందుబాబులే కనిపిస్తున్నారు.
డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా 16 మద్యం షాపులతో పాటు రెండు గీతా కార్మికుల మద్యం దుకాణాలున్నాయి. వీటికి తోడు కూల్డ్రింక్ షాప్లు, హోటళ్లు, కిల్లీ కొట్లలో సైతం మద్యాన్ని విక్రయిస్తూ టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. సిట్టింగ్కు అనుమతి లేకపోయినప్పటికీ ప్రతి మద్యం దుకాణం పక్కనే అదనపు గదులను ఏర్పాటుచేసి అందులో వాటర్ప్యాకెట్లు, స్నాక్స్ మద్యం ప్రియులకు అంటగట్టి జలగల్లా మద్యపానీయుల రక్తం పీల్చుతున్నారు.
ప్రతి గ్రామంలోనూ ఏడెనిమిది బెల్టుషాపులను ఏర్పాటు చేసుకునేందుకు టీడీపీ నాయకుడొకడు.. ఒక్కో బెల్ట్షాప్కు రూ.25 వేల చొప్పున విక్రయదారుల నుంచి వసూలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. టీడీపీ అగ్రనాయకునితో పాటు ఎక్సైజ్, సివిల్ పోలీసులకు మామూళ్లు ముట్టజెప్పేందుకే డిపాజిట్లు వసూలు చేశామని ఆ పార్టీ నాయకులు బాహాటంగా చెబుతుండటం గమనార్హం.