సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం మత్స్యకారులపై అమానుషంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర మత్స్యకారులు నిర్బంధించిన తమిళనాడు బోట్లను రాజకీయ లబ్ధి కోసం వదలిపెట్టేశారన్నారు ఆరోజు( ఆదివారం) నెల్లూరులో ఆయన ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాలను ఎండగట్టారు.
తమిళనాడు నుంచి బోట్లు వచ్చి రాష్ట్ర మత్స్య సంపదని అక్రమంగా దోచుకుంటున్నాయని దీంతో రాష్ట్ర మత్స్యకారులు ప్రాణాలకు తెగించి నాలుగు బోట్లు పట్టుకున్నారన్నారు. అంత కష్టపడి వాటిని పట్టుకుంటే మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో వాటిని వదిలిపెట్టారని తెలిపారు. బీదా మస్తాన్ రావ్, కావలి సీఐ కలిసి ఈ ఆపరేషన్ అమలు చేశారు. మత్స్యకార గ్రామ పెద్దకాపు తాతయ్య వీడియోలో చాలా స్పష్టంగా క్లియర్ వీరి పాత్ర కనబడుతుందన్నారు.
తమిళనాడు రాజకీయ ఒత్తిళ్లతోనే చంద్రబాబు, లోకేష్ ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. పోలీసులను ఉపయోగించి పక్క ప్లాన్ అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన దారుణంతో మత్స్యకారులు ఆవేశంతో రగిలిపోతున్నారని ఈ ఘటనపై గళం విప్పుతున్న మత్స్యకారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో మత్స్యకారుల భవిష్యత్తు కోసం ప్రత్యేక హర్బర్ నిర్మాణాలు చేపట్టారన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వాటిని సైతం ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.
పోలీస్ మార్క్ రాజకీయాలు నెల్లూరు జిల్లాలో రాజ్యమేలుతున్నాయని మంత్రి లోకేష్ పర్యటనకు మత్స్యకారుడు అయిన సర్పంచ్ కు ఆహ్వానం లేదని దుయ్యబట్టారు. శిలాఫలకంలో మత్స్యకార సామాజిక వర్గాలను చెందిన సర్పంచ్ పేరు వేయడానికి ప్రభుత్వానికి నామోషీగా ఉందన్నారు. తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారులకు అండగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఏదేమైనా అపహరించుకపోయిన బోట్లను యధాస్థానంలో పెట్టే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని మాజీ మంత్రి కాకాణి స్పష్టం చేశారు.


