పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అనంతపురం కలెక్టరేట్ను దిగ్బంధించిన రైతులు
గిట్టుబాటు ధరల కోసం వైఎస్సార్సీపీతో కలిసి అనంతపురం కలెక్టరేట్ దిగ్బంధించిన రైతులు
అనంతపురం: తీవ్ర కరువుబారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అనంతపురం జిల్లా రైతులు పోరుబాట పట్టారు. వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు చీనీ పంటకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం అనంతపురం కలెక్టరేట్ను దిగ్బంధించారు. మొక్కజొన్న, వరి పంటలను, ఎండిన చీనీ చెట్లను తోపుడు బండ్లపై పెట్టుకుని నిరసన తెలిపారు.
రైతులను ఆదుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎండిపోయిన చీనీ చెట్లే నిదర్శనమని చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


